Showing posts with label ఆంధ్రజ్యోతి. Show all posts
Showing posts with label ఆంధ్రజ్యోతి. Show all posts

Monday, July 5, 2010

అణగారిన అస్తిత్వాల్ని అణగదొక్కడమే మార్క్సిజమా?

రంగనాయకమ్మ వేసుకున్న ప్రశ్నలు చెప్పుకున్న జవాబుల గురించి మాట్లాడే ముందు 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' నేపథ్యం వివరించాల్సిన అవసరముంది. జనవరి 2009లో విశాఖలో నిర్వహించిన సభలో దళిత బీసి మైనారిటీ అస్తిత్వాల రచయిత్రులు కొన్ని ప్రతిపాదనలు, చర్చలు లేవదీయడం జరిగింది. లక్ష్యాలు కూడా రూపొందించడం జరిగింది.

పురాణాల నుంచి ఆధునిక స్త్రీవాద సాహిత్యం దాకా అణగారిన జాతుల (దళిత బహుజన మైనారిటీ ఆదివాసీ) స్త్రీలను మరుగుపర్చడం జరిగింది. ఈ సాహిత్యాలేవీ వీరి స్థితిగతుల్ని సమస్యల్ని కుల, శ్రమ దోపిడీని, సంస్కృతిని పట్టించుకోలేదు. చర్చించలేదు. సమాజానికి ఉత్పత్తి శ్రమనందించే అణగారిన స్త్రీలను సాహిత్యంలో భాగం చేయలేదు. వీరిని వూరిలో అంటరానోల్లని చేసినట్లే సాహిత్యంలోనూ దూరముంచారనే అవగాహనని సభ ముందుంచాము.

సమాజంలో స్త్రీలు కూడా కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా దొరసానులుగా, కూలీలుగా వున్నారు. వారి జెండర్ సమస్యలు ఒకే మూసగా లేవు. అణగారిన జాతుల స్త్రీల సమస్యలు, గడపదాటని దొరసాండ్ల సమస్యలు ఒక్కటి కావు. ఇలాంటప్పుడు స్త్రీలంతా ఒక్కటే అని చెప్పడంద్వారా అణగారిన జాతుల స్త్రీల సమస్యల్ని చర్చించే అవకాశం లేకుండాపోతుంది.

పురుషాధిక్యత నుండి విముక్తే స్త్రీలందరి విముక్తిగా ఆధిపత్య కులాల మహిళలు చెప్పడం యితర స్త్రీల చుట్టూత వున్న రాజకీయ ఆర్థిక సాంఘిక శ్రమ కుల సమస్యల్ని మగ పెత్తనాల సమస్యల్ని వెలుగులోకి రానివ్వకుండా అణచివేయడమేనన్న విషయాల్ని సభ అంగీకరించింది.

స్త్రీవాద సాహిత్యం ప్రధానంగా కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల నుంచే వచ్చింది. ఈ సాహిత్య ఉధృతి, ఉత్పత్తి పెరిగినా, తరిగినా మెజారిటీ స్త్రీలైన దళిత బహుజన మైనారిటీ ఆదివాసీ స్త్రీలకు ఒరిదింది, తగ్గింది ఏమీలేదు. ఈ అస్తిత్వాల స్త్రీలకు కులం ప్రాంతం మతం మగాధిపత్యం, ఆసామి అజమాయిషి, దొర్సాని పెత్తనాలు అంటరానితనం అణచివేతలున్నాయి.

ఈ అణచివేతల నుండి వీళ్లు విముక్తి కావలసివుంది. 'స్త్రీవాదం' అనే పదం యిన్నాల్లు కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల సమస్యలకే పరిమితమైవుంది. ఉమ్మడి వేదికకి ఈ పదం యిమడదని అనగా విస్తృత అస్తిత్వాలుగా వున్న అణగారిన స్త్రీలకు సరిపోదు అనే అభిప్రాయాన్ని సభ ఆమోదించింది.

అయితే మా ఈ చర్చల్ని, ప్రతిపాదనల్ని, ఆమోదాల్ని, దానికి సంబంధించిన రిపోర్టును పక్కనబెట్టి సభలో వీగిపోయిన శ్రమ సంబంధాల స్త్రీల సాహిత్య, శ్రమ తప్ప వేరే అస్తిత్వాలు లేవనే వాదన రిపోర్టు పత్రికల్లో రావడం జరిగింది. సభా నిర్వాహకులు ప్రత్యక్షంగా వ్యతిరేకించకపోగా పరోక్షంగా అనుకూలతను వెలిబుచ్చడం జరిగింది. సభా చర్చలు ఆమోదాలు ఎక్కడా వెలుగు చూడలేదు. యిలాంటి అణగదొక్కే అనుభవాల అవమానాల్తో వీరి ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా అణగారిన అస్తిత్వాల రచయిత్రులు 'మట్టిపూలు'గా సంఘటితమయ్యారు.

ఒకవైపు దళిత బహుజన మైనారిటీ రచయిత్రుల అభిప్రాయాల్ని అతి దారుణంగా అణచివేసి యిప్పుడు 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' అని పెట్టుకున్న ఆధిపత్య కులాల రచయిత్రులు మరోవైపు తమ అనుకూలురైన అణగారిన కులాల రచయిత్రుల్ని వేదికలో పెద్దపీటలేసి తమ ఆధిపత్య జెండర్ ప్రయోజనాల్ని కొనసాగించే పనిలో పడ్డారు. తద్వారా అణగారిన జాతుల స్త్రీలను అణచివేసే కార్యక్రమం పెట్టుకున్నారు. విశాఖ సభలో ఓడిపోయిన, కాలం చెల్లిన వాదనలు అణగారిన స్త్రీల భిన్న అస్తిత్వాల పుటంలో బూడిదైన వాదాన్ని రంగనాయకమ్మ మార్క్సిస్టు పుటంలో పెట్టి వూదుకుంటున్నారు.

నిజానికి ఈ చర్చా పాఠం సందర్భం స్త్రీల భిన్న అస్తిత్వాల మీద జరగాల్సినది. స్త్రీల భిన్న అస్తిత్వాల చుట్టూ అల్లుకుపోయిన దోపిడీ కుల రాజకీయాల గురించి జరగాల్సిన చర్చ. కాని రంగనాయకమ్మ చాలా పకడ్బందీగా ఆ ప్రస్థావనే లేకుండా, లేవదీయకుండా జాగ్రత్త పడింది. అస్తిత్వమంటే ఏమిటి? అని ప్రశ్న వేసుకొని జాతుల్లో కులాల్లో మతాల్లో తేడాలున్నాయని జవాబు చెప్పుకుని స్త్రీలల్లో వున్న ఎక్కువ తక్కువల వూసుగాని, ప్రస్థావన గాని చేయకపోవడం ద్వారా ఆధిపత్య కుల దొర్సానితనాన్నే ప్రదర్శించింది. అణగారిన స్త్రీల అస్తిత్వాల్ని తొక్కేసింది.

కులమనేది శ్రమవిభజనే కాదు శ్రామికుల మధ్య విభజన కూడా సృష్టించిందని అంబేద్కర్ చెప్పాడు. నేడు సమాజంలో వున్న భిన్న అస్తిత్వాల మీద చర్చ నడుస్తున్నది. కాని భిన్న అస్తిత్వాలతో వున్న మహిళలకు సంబంధించిన అస్తిత్వాల చర్చకు మాత్రం అవకాశం యివ్వడం ఆధిపత్య కుల స్త్రీలకు యిష్టంలేదు. మా సమస్యలు వేదిక లెక్కడం లేదు. వెలుగు చూడ్డంలేదు.

సాహిత్యంలోనూ అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నాం. మా సమస్యల్ని ఆధిపత్య కుల మార్క్సిస్టు రచయిత్రి అర్థం చేసుకోగలదా? అస్తిత్వాలు అర్థం కావాలంటే కులవ్యవస్థను అర్థం చేసుకోవాలి. కుల సమాజంలో పుట్టి ఉత్పత్తి శక్తుల్ని, ఉత్పత్తి సంబంధాల్ని మానవ సంబంధాల్ని నియంత్రించేది, నిర్దేశించేది కులం కాదు అని ఎట్లా చెప్పగలము.

ఆమె ఏకరువు పెట్టిన కార్మికులు, పెట్టిబడిదారులు కూడా కుల వ్యవస్థ పునాదుల్లోనే వున్నారని తెలవదా! ఇక్కడ సమాజిక సాంస్కృతిక రూపం నిర్ణాయక మౌళిక అస్తిత్వం కులమే అని అనుభవంలోకి రావాలంటే అణగారిన కులాల్లో స్త్రీగా పుడితేనే తెలుస్తుంది. అణగారిన కులాలవాళ్లే శ్రమ చేసేవాళ్లుగా, ఆధిపత్యకులాలవాళ్లే శ్రమని దోచేవాళ్లుగా వ్యవస్థీకృతంగా ఎందుకు కొనసాగుతున్నారో చర్చ చేయండి. ఆ చర్చకోసం ప్రశ్నలు వేసుకోండి.. యింకా అస్తిత్వాలు బాగా అర్థం అవుతాయి.

రోడ్లూడ్చే, పాకీ, పారిశుధ్య శ్రమలో ఆధిపత్య కులాలవాళ్లు ఎందుకు లేరు? దళిత కులాలవాళ్లే ఎందుకున్నారు? యిది శ్రమ విభజనా? కుల విభజనా? కులం సృష్టించే మానవ, ఉత్పత్తి సంబంధాల్ని, సంస్కృతుల్ని వివక్షల్ని మార్క్సిజం వంటి సిద్ధాంతాలు ప్రశ్నించలేవు, పరిష్కరించలేవు. ఈ విషయాలు లేవనెత్తిన కులాల్ని బహుజన ప్రయోజనాల్ని దెబ్బతీసే వాదాల్తో అణచివేస్తున్నాయి. మార్క్సిజంని వ్యక్తిగత ఆస్తిగా చూసే రంగనాయకమ్మ కూడా తన చర్చా ప్రశ్నల్లో మూసేసింది. ఆధిపత్య దోపిడీ గురించి మాట్లాడే యీ రచయిత్రి అణగారిన స్త్రీలపై వుండే ఆధిపత్యాలపట్ల మౌనం వహించి మరుగున పడేసింది.

సామాజిక అసమానతల్నుంచే అస్తిత్వాలేర్పడ్డాయని, అసమానతలు పోయిన్నాడే అస్తిత్వాలు పోతాయని యీ రచయిత్రికి తెలవ దా? అస్తిత్వాలంటే హక్కులు సాధించుకునేందుకు సాధనాలుగా వున్నాయని అస్తిత్వాల్ని చులకన చేసి అవమానించడం ఆధిపత్య కుల అహంకారానికి నిదర్శనం. అస్తిత్వ పోరాటాలు అస్తిత్వాల్ని మోయడానిక్కాదు, నిర్మూలించడానికే.

హక్కులు, అవకాశాలు, స్వేచ్ఛ ఉన్న కులాలకు అవి సాధించుకోవాల్సిన అవసరం లేదు. అవి సాధించుకోడానికి అస్తిత్వాలుగా కదులుతున్నారంటేనే వాళ్లెంతగా హక్కులు కోల్పోయారో, ఎంతగా హక్కులు కొల్లగొట్టబడినారో అర్థం చేసుకోవచ్చు. కులం వల్ల అన్నీ అమరిన వాళ్లకేం అర్థమవుతాయి హక్కుల్లేని అస్తిత్వాలు! మొత్తానికి ఆధిపత్య కుల మార్క్సిస్టు రచయిత్రి మేమెదుర్కొంటున్న ఎన్నోరకాల అణచివేతలకు సంబం ధించిన అణగారిన స్త్రీ అస్తిత్వాల్ని చర్చ చేయకుండా తొక్కేసింది.

పురుషాధిపత్యం పోవాల ని కోరుకుంటున్న ఆధిపత్య కులాల స్త్రీలు అణగారిన స్త్రీల అస్తిత్వాల్ని అణగదొక్కడం, పూడ్చేయడం ప్రజాస్వామికం కాదు, ఆధిపత్య కుల మార్క్సిజమే.

అణగారిన కులాల స్త్రీలపై ఆధిపత్య కులాలు చేసే అన్ని రకాల అణచివేత రాజకీయాల్ని ఎదించడానికి దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ రచయిత్రులంతా సంఘటితం కావాలి.

- జూపాక సుభద్ర

(Andhra Jyothy vividha 5-7-2010)

Monday, June 29, 2009

అస్తిత్వ సాహిత్యాలను ఎదగనివ్వడమే నేటి ప్రజాస్వామ్యం

గురజాడ, చలం, శ్రీశ్రీ శత జయంతి, వర్ధంతి కార్యక్రమాలను, సంస్మరణ ప్రత్యేక సంచికలను, ప్రత్యేక కథనాల ప్రసారాలను ముమ్మరం చేసారు. ఇదంతా రచనా రంగంలో ఆధిపత్య కులాల పెత్తనాలను కాపాడుకునే ప్రయత్నాలే! తెలుగులో అస్తిత్వ సాహిత్యాలు బలంగా ముందుకు సాగుతున్నాయి. మాదిగ, దళిత, ముస్లిం, దళిత క్రైస్తవ, తెలంగాణ, బిసి సాహిత్యాలు ఇందుకు నిదర్శనం. మాదిగ సాహిత్య వేదిక, దండోరా- మైసమ్మ- ఏకలవ్య ప్రచురణలు, గుంపు సాహితి, భాగ్యనగర్ బుక్‌ట్రస్టు లాంటి అనేక ప్రచురణ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇపుడు మరో అడుగు ముందుకుపోయి ఎస్సి ఎస్టి బిసి మైనారిటి రచయిత్రుల వేదిక 'మట్టిపూలు' పరిమళం మొదలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ సాహిత్యం వస్తూనే ఉంది. ఈ సాంస్కృతిక పునర్జీవనం కోస్తాయేతర ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణ కేంద్ర బిందువుగా సాగుతోంది. అలాగే అణగారిన అన్ని సమూహాల్లో ఈ పునర్జీవనం ప్రారంభమయ్యింది. అణగారిన కులం జాతి-తెగ-జెండర్-మతం- భాష- ప్రాంతాలకు చెందిన చైతన్యంతో వస్తున్న రచనలవల్ల బ్రాహ్మణ,శూద్ర ఆధిపత్యకులాల గుత్తనాయకత్వం, పట్టు క్రమంగా తగ్గిపోతోంది. అస్తిత్వ సాహిత్వాల ప్రతిఘటన ను, సవాళ్లను ఆధిపత్యకుల రచయితలు, వారి అభిమాను లు జీర్ణించుకోలేకపోతున్నారు.స్వాగతించలేకపోతున్నారు. దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, బిసీల జీవితాలను స్పృశించని కోస్తా బ్రాహ్మణ రచయితలు గురజాడ, శ్రీశ్రీ, చలం మొదలగువారిని బహుజన సమూహాలన్నింటికి సాహిత్య ప్రతినిధులుగా రుద్దే కుట్రలు జరుగుతున్నా యి. అనేకానేక పరిమితులున్న వారిని ప్రగతిశీల, అభ్యుదయ, ఆధునిక, విప్లవ సమగ్రతల మహత్తులు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి గొప్పతనం 'అనంత'మైనద ని ఆధిపత్య కులాల రచయితలు అంటున్నారు. భవిష్యత్ తరాలకు కూడా సమకాలికుడు గురజాడ అనీ, ముద్దుల గురజాడ అని, కన్యాశుల్కం - శ్రీశ్రీ శత జయంతి సందర్భాన్ని 'ఒకే ఆకాశంలో రెండు పున్నము'లని, జీవజలం చలం అనీ పాళీలు అరిగిపోయేలా పొగడ్తలు రాసేస్తున్నారు. వీరి శత జయంతి, వర్ధంతి కార్యక్రమాలను, సంస్మరణ ప్రత్యేక సంచికలను, ప్రత్యేక కథనాల ప్రసారాలను ముమ్మరం చేసారు. ఇదంతా రచనారంగంలో ఆధిపత్య కులాల పెత్తనాలను కాపాడుకునే ప్రయత్నాలే! నేటికీ ఆధిపత్య కులాలే పురోహిత, విద్య, పరిపాలన, సాంస్కృతిక, ఆర్థిక వ్యవస్థలను నియంత్రిస్తున్నాయి. వారసత్వం, భూమి (ధనం), కులంతో సమాజంపై పట్టు నిలుపుకునే ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాయి. బహుజన సమూహాలపై సాంస్కృతిక దాడిని సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ఆధిపత్య కులాలు కొనసాగించే దుశ్చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అస్తిత్వ ఉద్యమాల సంరంభాన్ని తెరమరుగుపరచటానికి ఆధిపత్యకులాలరచయితలు వొడి గడుతున్నారు. అస్తిత్వ ప్రవాహాలను అప్రధానం, అదృ శ్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నారు. మాదిగ, ముస్లిం, తెలంగాణ, బహుజనవాద రచయితలను గందరగోళపరి చి అస్తిత్వవాదాలనుండి మరలించి సాహిత్య రాజకీయా ల్లో పాలేర్లు (కార్యకర్తలు)గా, కోవర్టులుగా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని సాహిత్య వేదికల ఏర్పాటు ఇందులో భాగమే. అప్పారావు, శ్రీశ్రీ, చలంలకు ప్రగతిశీల, అభ్యుదయ, విప్లవ ముద్రలు వేసి, పరోక్షంగా బ్రాహ్మణ రచయితల్లో గొప్పతనం ఉందనిచెప్పే మోసం జరుగుతున్నది. బ్రాహ్మణ రచయితలు గొప్పవారని ప్రచారం చేసి, తర్వా తి వరసలో శూద్రాధిపత్య కులాల ఆధిక్యతలను సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో స్థాపించుకునే దుర్నీతి ఇది. 'మంచియన్నది మాలయైతే, మాల నేనగుదున్' అన్నా డు గురజాడ. అప్పారావు దృష్టిలో మాల మంచిదో కాదో సందేహంగానే మిగిలింది! కన్యాశుల్కం నాటకంలో రామ ప్ప పంతులు అనే బ్రాహ్మణ పాత్ర చేత అసిరిగాడు (దళితుడు) పాత్రని ఉద్దేశించి 'అపవిత్రం ముండాకొడుకు ఏవై నా తింటాడు. బ్రాహ్మలం పవిత్రమైనవాళ్లం గదా' అని కుల వివక్ష ప్రదర్శిస్తాడు. అప్పారావు నేడు బతికుంటే తీవ్ర విమర్శలను ఎదుర్కొని ఉండేవాడు. కాలం చెల్లిన, అమానవీయమైన కన్యాశుల్కం అభ్యుదయ నాటకమని కీర్తించే సాహిత్యాభిమాన శిఖామణులు రాజ్యాంగంలోని అధికరణం 17 అంటరానితనాన్ని నిషేధించిందని, కుల వివక్ష శిక్షార్హమైన నేరంగా గ్రహిస్తే మంచిది. బ్రాహ్మణ బాలిక పూర్ణమ్మ దయనీయస్థితి గురించి రాసిన అప్పారావు, దళిత పాత్ర అయిన అసిరిగాడికి గౌరవప్రదమైన పేరు పెట్టకపోవటం, మానవ హుందాతనం కల్పించలేకపోవ టం, ఆయనలోని బ్రాహ్మణ వివక్ష, అహంకారం కాదా? సాహిత్యయుగాన్ని ఇకపై నేను నడిపిస్తున్నానని గొప్ప లు పోయిన శ్రీశ్రీ కవిత్వంలో 'భూతాలు, యజ్ఞోపవీతా లు' వంటి హిందూ గ్రాంధిక వ్యాకరణ (బ్రాహ్మణ) శబ్దా లు చాలానే ఉన్నాయి. వ్యాకరణంలో చందోబద్దంగా బ్రాహ్మణ రచయితలే రాస్తారు. దానిని తోసిపుచ్చి శ్రీశ్రీ వంటి బ్రాహ్మలే చందస్సు సంకెళ్లని చట్‌ఫట్‌మని తెంచేస్తారు! సాహిత్యంలో గ్రాంధిక రచనా బ్రాహ్మణ్యమైనా, సరళ రచనా బ్రాహ్మణ్యమైనా వారి సొత్తేకాని, బహుజన రచయితల సొత్తు కాదని చెప్పే అహంకార ప్రదర్శన ఇది. ఏ గొప్ప ప్రాధాన్యత, విలువైనా బ్రాహ్మణులకే తప్ప బ్రాహ్మణేతర రచయితలకు కాదనే కుల వివక్ష కూలిపోవాల. ఆఫ్రికా ఖండంలోని 'హాటెన్ టాట్, జూలు, నీగ్రో' లు కనిపించిన శ్రీశ్రీకి రాజకీయ, మానవ హక్కులకోసం దేశంలో దళితులు చేసిన ఏ పోరాటమూ, ఉద్యమమూ కనిపించకపోవటం ఎంత ఆశ్చర్యం! కవితా వస్తువుగా శ్రీశ్రీకి దళిత జీవితం పనికిరాకపోవటం అమానుషం అనిపించడంలేదా? పోనీ, ఇది శ్రీశ్రీ పరిమితి అని అతని అభిమానులు వొప్పుకుంటారా? 'కసాయిబు' తిట్టు పద సృష్టి చేసినందుకు శ్రీశ్రీ అస్తిత్వ చైతన్యం కలిగిన నేటి ముస్లిం రచయితల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సిఉండేది. బ్రాహ్మణ, శూద్రాధిపత్య కులాల స్త్రీల స్వేచ్ఛని రచన ల్లో చిత్రించిన చలానికి బహుజన జెండర్ శ్రమలు గుర్తుకురాకపోవటం వింతేమీ కాదు. అది ఆయన కులం పరిమితి. మాదిగపిల్ల శీర్షిక పెట్టి మాలపిల్ల కథ చెప్పటం చలం అసం బద్ధ వస్తువిజ్ఞతకే చెల్లింది! అప్పారావు, శ్రీశ్రీ, చలంలకున్న పరిమితులను చూడనీయకుండా బ్రాహ్మణ, కోస్తాంధ్ర సాహిత్యకారులు వారికి మహిమలు అంటగట్టే ప్రయత్నా లు మానుకుంటే అస్తిత్వప్రవాహాల ప్రజాస్వామ్యానికి మేలు చేసినవారవుతారు. అడుగుజాడలని, మహాకవులని, స్త్రీవి ముక్తి నిర్దేశకులని కోస్తా బ్రాహ్మణ కవులను పొగుడుకోవటం దురదృష్టకరం. దేశంలో మెజారిటీ అయిన అణాగారిన జాతుల జీవితాలను వస్తువుగా స్వీకరించని బ్రాహ్మణ రచయితలను ఆకాశానికెత్తటం ప్రజాస్వామ్యానికే విఘాతం. అప్రజాస్వామిక, నిరంకుశ సాంస్కృతిక ధోరణులను బలపరుస్తున్న కమ్మ, రెడ్డి, సాహిత్యకారుల తీరు మారాలి. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, మాదిగ, దళిత, ముస్లిం, బహుజన వాదాల రచయితలు మేల్కొని ఉండి సాహి త్యంలో పాత పల్లకీల మోతను గట్టిగా వ్యతిరేకించాలి. సమానత్వాన్ని కోరే అస్తిత్వ ఉద్యమాలను ఎదగనివ్వడమే నేటి సాహిత్య ప్రజాస్వామ్యం. ఆధిపత్య కులవాదులు తమ కొమ్ములు కత్తిరించుకోడానికి సిద్ధం కావాల్సిందే. కాదంటే సౌహ్రార్దతకు తావు లేని సాహిత్యానికి చదువురులూ శ్రోతలూ మిగలరు. - కృపాకర్ మాదిగ
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

Sunday, January 25, 2009

మనలో 'మన'మున్నామా? ( Andhra Jyothy 26-1-2009)

చరిత్రలో మాకు జరిగిన జరుగుతున్న రకరకాల మోసాల అనుభవాలున్న కారణంగా ఉమ్మడి రచయిత్రుల వేదిక పట్ల సంశయంతోనే 'మనలో మనం' సభలకు (జనవరి 10, 11 విశాఖపట్నం) వెళ్లడం జరిగింది. ఈ రెండు రోజులు కూడా స్త్రీ సాహిత్యం దళిత-బి.సి-గిరిజన -ముస్లిం స్త్రీలను పట్టించుకోలేదని, కలుపుకోలేదని, వారి సాహిత్యాన్ని కుక్క ముట్టిన కుండలాగానే దూరం బెట్టిందనే అవగాహనతో చర్చ ప్రారంభించాం. 'స్త్రీవాద' సాహిత్యం ప్రధానంగా కోస్తాంధ్ర ఆధిపత్యకులాల నుంచే వచ్చింది. దాని ఉధృతి పెరిగినా తగ్గినా దళిత బి.సి. మైనారిటీ రచయిత్రులకేం తరిగింది ఒరిగిందిలేదు. దళిత, బి.సి, ముస్లిం స్త్రీలకు కులం, శ్రమ, మతం, మగాధిపత్యం అణచివేతలు చుట్టుముట్టివున్నాయి.

కొద్దిమంది ఆధిపత్య కులాల స్త్రీలు జెండర్ ప్రాతిపదికన ఒకే అస్తిత్వం ఏకపక్షంగా ప్రకటించుకోవడం మాకు అభ్యంతరం. స్త్రీలంతా ఒకటి కాదు. కుల, మత, ప్రాంత అస్తిత్వాలతో ఎవరి కులాల్లో, ఎవరి శిబిరాల్లో ఎవరి పొయిలు వారికున్నయి. వారి సమస్యలు ప్రత్యేకంగా ఉన్నాయి. స్త్రీలంతా ఒక్కటే అనడం వల్ల స్త్రీలల్లో వున్న అసమానతల్ని వారి అస్తిత్వాల్ని మాట్లాడనివ్వకుండా అవగాహన చేస్కోలేని అప్రకటిత సెన్సార్‌షిప్‌లకు గురిచేసే, గురయ్యే ప్రమాదముంది. తద్వారా స్త్రీ సాహిత్యం అసమగ్రం అవుతుంది. ఈ సభల్లో ప్రధానంగా చర్చ జరిగింది దళిత, బి.సి, ముస్లిం స్త్రీల జీవితాల చుట్టూ ఆవరించిన ఆకాంక్షలకి, అభివృద్ధికి సాహిత్యం చేసిన కృషి, సేవ ఏమీలేదనే! వారి అనుభవాలు, సంఘర్షణలు, శ్రమదోపిడి, కుల దోపిడి, వారెదుర్కొంటున్న మగ వాదం దిశగా చర్చ జరగాలి అనే దాని చుట్టూ సభ స్పందించింది.

దళిత బి.సి. ముస్లిం స్త్రీల అస్తిత్వాలకు సంబంధించిన అధికార రాజకీయాల్ని ఏ మేరకు గుర్తిస్తున్నారు, అవి ఏ మేరకు సాహిత్యంలో భాగమయ్యాయి? రచయిత్రులకు ఉమ్మడి వేదిక కావాలనుకుంటే ముందుగా కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల రచనలకు పరిమితమైన 'స్త్రీవాద' పదం, విస్తృతమైన-మెజారిటీగా వున్న-అణగారిన దళిత బి.సి. ముస్లిం గిరిజన స్త్రీల సాహిత్యానికి సరిపోదు, యిమడదు. అందుకే ఆ పదం పట్లనే మాకున్న అభ్యంతరాల్ని సభ ఆమోదించింది. ఇకమీదట దళిత స్త్రీవాదం, ముస్లిం స్త్రీవాదం అని మా సాహిత్యాన్ని సంబోధించొద్దు.

ఆ 'స్త్రీవాదం' అనే పదం లేకుండా దళిత మైనారిటీ బి.సి స్త్రీల విస్తృతి ప్రాతిపదికన ఒక కొత్త పదాన్ని రూపొందించుకోవాలనే మా అభ్యంతరంపై సభ ఆమోదం తెల్పింది. ఒకరిద్దరు ఆధిపత్య కులాల విప్లవ సంఘాల రచయిత్రులు ఈ కులాలు, అస్తిత్వాల కంటే శ్రమ స్త్రీల నుంచి సాహిత్యం రావాలి అన్నారు. ఆ విషయంతో మేము తీవ్రంగా విభేదించి శ్రమ-కులం వేరువేరుగా లేవు. కులమే శ్రమగా వ్యవస్థీకృతమైంది. కులమనేది పుట్టుకతోనే సంఘబానిసల్ని తయారు చేసింది భారతదేశంలో. కులమనేది శ్రమ విభజననే కాదు శ్రామికుల మధ్య విభజనను కూడా సృష్టించిందనే వాస్తవాన్ని తెలుసుకోవాలనే వాదన పెట్టాం. దాని చుట్టూ జరిగిన చర్చలో 'శ్రమ స్త్రీలు' ప్రత్యేకం అనే వాదం వీగిపోయింది.

ఇక వాకపల్లి వెళ్లడాన్ని ఉద్యమ యాత్రగా చెప్పటంపైన మా అభ్యంతరం వాళ్లకు స్వీపింగ్ కామెంట్‌లా కనిపించింది. వాకపల్లి వెళ్లి అరకు చూసిరావడాన్ని ప్రశ్నించడం వారికి మింగుడుపడలేదు. గుజరాత్ వెళ్లేప్పుడు ముస్లిం స్త్రీలు ఎందుకు కనిపించలేదు? అన్న ప్రశ్నకు జవాబులేదు. చుట్టూ ఇంత క్షోభ, ఇంత పోరాటం, ఇంత వస్తువు, ఆత్మహత్యలు, హత్యలు, అవమానాలు ఇన్ని జరుగుతుంటే మీరు మళ్లీ రామాయణ మహా భారతాల్లోకి వెనక్కి వెళ్లి రాయడం వస్తు రాహిత్యమా? బాధ్యతా రాహిత్యమా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు.

పక్కనే ఉన్న సిరిసిల్లలో ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుంటే ఎందుకు వెళ్లలేదంటే సమాధానం లేదు. దళిత బి.సి. ముస్లిం స్త్రీలు ఇంత విస్తృతంగా రాస్తుంటే, భాష అడ్డమొచ్చిందనో యాస అర్ధం కావట్లేదనో వంకలు పెట్టి వీరి సాహిత్యాన్ని దూరం ఉంచారు సరే, కనీసం అక్షర రూపంలో దాడి జరుగుతుంటే సపోర్టు కూడా ఇవ్వలేదు, ఎందుకు? అన్న ప్రశ్నకూ సమాధానం లేదు. ఇక వీరిలో నవలా రచయిత్రి ఒకరు 'ముద్దు పెట్టుకుంటున్న సమయంలో నేను స్త్రీనో పురుషుణ్ణో మరచిపోతాను... మనం రాసేదంతా కల్పనే కదా' అనడం అస్తిత్వవాదాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లే కదా!

సాహిత్యమంతా కల్పనే అనే ప్రమాదకర స్టేట్‌మెంట్ ఇచ్చినట్లవుతుంది కదా! కథా రచయిత్రి ఒకరు 'బ్రాహ్మణ ఇళ్లల్లో పనిచేస్తారు, వాళ్లిచ్చినవి తింటారు, మా ఇళ్లల్లో పని చేయరు, మేమిచ్చినవి గోడవతల పడేస్తారు' అని దళితుల గురించి మాట్లాడారు. ఇలాంటి భావజాలాలతో నిండి ఉన్న మనస్సులు, మనుషులతో ఎలా కలిసిపోతాం? నిలువెత్తు గోడలు కట్టుకుని కూర్చుని 'మనలో మనం' అనడం ఎంతవరకు సబబు? అనిపిస్తున్నది.

అగ్రవర్ణ పురుషాధిపత్యాన్ని ప్రశ్నించడం వరకే పరిమితమైన స్త్రీవాద సమూహం, మెజారిటీగా ఉన్న బి.సి, దళిత, మైనారిటీ స్త్రీల సమస్యలపై ఏనాడు స్పందించింది లేదు. వారి సమస్యలపట్ల అంటీముట్టనట్లుగా ఉండటమే కాక దళిత రచయిత్రులు లేవనిత్తిన ప్రశ్నలకు కూడా వీరి వద్ద సమాధానాలు లేవు. కుల వివక్ష గురించి, మత దాడుల గురించి వీళ్లు మాట్లాడింది లేదు.

అదేదో తమకు సంబంధించని విషయంగానే చూస్తూ వస్తున్నారు. ముస్లిం రచయిత్రుల భాషపట్ల వచ్చిన విమర్శ కూడా తెలిసిందే. ముస్లిం స్త్రీలు తమ మతం వల్ల గురయ్యే హింస గురించి రాసినపుడు సపోర్టు చేసినంతగా హిందూత్వవాదుల దాడుల గురించి రాసినదాని పట్ల మౌనంగా ఉండటం గమనించవచ్చు. అలాగే స్త్రీవాదులెప్పుడూ ప్రజాస్వామికోద్యమమైన ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చింది లేదు. మరో ప్రజాస్వామిక ఉద్యమమైన మాదిగ దండోరా పట్ల కూడా మద్దతు ప్రకటించలేదు. మరి వీరెలా ప్రజాస్వామికవాదులవుతారు? ఉమ్మడి వేదికను చారిత్రక ఘట్టంగా వర్ణిస్తూ, 'మేమే చేశాం' అని చెప్పుకోవడానికే మమ్మల్ని ఆహ్వానించినట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే ఇంతకు మునుపు వీళ్లెవరూ అస్తిత్వ వాదాల గురించి మాట్లాడటం, రాయడం చేయలేదు. కదులుతున్న నీలిమేఘాలు ఎవరిని కబళించాలని? ఉరుముతున్న నల్లమబ్బుల మీద వీరికి ప్రేమ లేదు. పైగా మా జాతుల మీద ప్రేమ లేని రచనలూ వీరి పుస్తకాల్లో చూడొచ్చు. ఉన్న గ్యాప్స్‌ని కొత్త ఋతువుల కింద పూడ్చేయాలని చూస్తున్నారా? అస్తిత్వాల గొంతు నొక్కేయాలనుకుంటున్నారా? ఇంకా ఇలాంటి అనేకానేక కారణాల వలన, 'స్త్రీవాదం'తో మేము మమేకం కావడం వల్ల మా అస్తిత్వాల్ని వారు మింగేసే ప్రమాదం ఉండొచ్చని భావిస్తున్నాం.

మా ప్రత్యేక అస్తిత్వాల్ని గుర్తించ నిరాకరించే 'స్త్రీవాదులు' మా వాదాల్ని, వాదనల్ని గౌరవించనపుడు వారితో కలిసి పని చేయడం ప్రశ్నార్థకమవుతుంది. మా భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినవారమే అవుతాం. మా సందేహాలకు, సంశయాలకు స్పష్టమైన సమాధానాలు దొరికితే ఉమ్మడి వేదిక సాధ్యం కావొచ్చేమో! లేకపోతే మా పోరాటం మేము ఎలాగూ చేస్తూనే పోతాం.

- జూపాక సుభద్ర, షాజహానా

Monday, May 19, 2008

చలం కి కుల స్పృహ లేదు

సమాజం దళిత స్త్రీలను ఎలా చూసిందో చలం కూడా అలాగే చూశాడు. స్త్రీల ప్రత్యేక సమస్యలను పట్టించుకోకుండా కేవలం అగ్రకులాల దురాచారాలను సంస్కరించుకున్నాడు. క్రిందికులాల్లో ఉన్న సామాజిక రుగ్మతలు ఆయనకు పట్టలేదు. ఆయనకు కుల స్ప­ృహ లేదనడానికి నిదర్శనం 'మాదిగమ్మాయి' కథలో ఆయన మాలమ్మాయిని వర్ణించడం. అగ్రకుల మహిళల పురోగతికి ఆటంకంగా ఉన్న రుగ్మతలమీద పోరా డి అదే సామాజిక సంస్కరణని అనుకుంటే ఎలా? జెండర్‌మీద సామాజిక ఆధిపత్యం గురించి చెప్పాడు సరే. కులం ఇంకా బలమైనది కదా? రచయితకు సామాజిక దృక్పథం ఉండాలి కదా? అందువల్ల ఆయనను మోయాల్సిన అవసరం మాకు లేదు. అయితే, చలం స్త్రీని చాలా సున్నితంగా చూడడం మనకు నచ్చుతుంది. మహిళ విముక్తికోసం, స్వేచ్ఛకోసం, జెండర్ వివక్షకు వ్యతిరేకంగా ఆయన యుద్ధమే చేశాడు. ఆ పోరాటం చిన్నది కాదు. ఆయన లైంగికస్వేచ్ఛ మాత్రమే చెప్పాడని నేను అనుకోను.
- -జూపాక సుభద్ర
(ఆంధ్ర జ్యోతి 19-05-2008)

Wednesday, March 5, 2008

బడుగులకు దక్కింది అడుగూ బొడుగూ...!

(బడ్జెట్ లో దళితులకు జరిగిన కేటాయింపుల గురించి కృపాకర్ మాదిగ, జూపాక సుభద్ర లు రాసిన ఈ వ్యాసం ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైంది.)
అగ్రవర్ణాల ఇళ్ళలో జరిగే సామూహిక భోజనాల్లో అగ్రకులాలకు ముందు వడ్డిస్తారు. ఆహ్వానితులైనప్పటికీ దళితులు, సంచార, అర్థసంచార జాతులకు చివర్లో వడ్డిస్తారు. అప్పటికి పదార్ధాలన్నీ అడుగంటిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇలాగే అమర్యాదకరంగా ఉండటం దురదృష్టకరం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ కథ ఎలా ఉందంటే, దేశంలో ఏ పల్లెటూరులోనైనా అగ్రవర్ణాల ఇళ్ళలో సామూహిక భోజనాలు జరిగినపుడు ఆహ్వానితుల్లో అగ్రకులాలకు ముందు వడ్డిస్తారు. ఆహ్వానితులైనప్పటికీ దళితులు, అర్థసంచార, సంచా ర జాతులకు చివర్లో వడ్డిస్తారు. అప్పటికి పదార్ధాలన్నీ అడుగంటిపోతా యి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇలాగే అమర్యాదకరంగా ఉండటం దురదృష్టకరం. ప్రభుత్వం పూర్తిగా ఎన్నికల బడ్జెట్‌ని ప్రవేశపె ట్టింది. శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల బడ్జెట్‌లకన్న, చాలా రాష్ట్రాల బడ్జెట్‌ల కన్న తమ బడ్జెట్ చాలా పెద్దదనీ, గత బడ్జెట్‌ల కన్న రెట్టింపు బడ్జెట్ అని ప్రభుత్వ పెద్దలు ఈ సందర్భంగా చెప్పుకు న్నారు. లక్షకోట్ల రూపాయల పైగా అంచనాతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ బడుగుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. అణగారిన సామాజిక వర్గాల వారికి జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు కావాలంటున్న దళిత ఫ్రజాసంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. బడుగుల సంక్షేమానికి కొత్త బడ్జెట్‌లో తిరిపెం విదిల్చినట్టు నిధులు కేటాయించిం ది. బహుజనులు శంకించినట్టుగానే సాగునీరు, వ్యవసాయం, పారిశ్రా మిక మౌలిక సదుపాయాలకల్పన, పెద్దకంపెనీలు, ఇన్ఫర్మేషన్‌టెక్నాలజీ ప్రత్యేక ఆర్థికమండళ్ళ అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా జరి పింది. తద్యారా అగ్రకుల బడాబాబులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఒక రూపాయి ప్రభుత్వం నడపడం కోసం, ఒక రూపాయి ప్రజల సంక్షేమం కోసం అనుకుంటే, లక్షకోట్ల రూపాయలు మించిన కొత్త బడ్జెట్ లో రాష్ట్ర జనాభాలో 18 శాతంగా ఉన్న దళితుల సంక్షేమానికి తొమ్మిది వేల కోట్లు కేటాయించాలి. అలాగే 7 శాతంగా ఉన్న ఆదివాసులకు 3,500 కోట్లు, 52 శాతంగా ఉన్న వెనుకబడిన తరగతులకు 26,000 కోట్లు, 12 శాతంగా ఉన్న మైనారిటీలకు 6,000 కోట్లు కేటాయించాలి. ఇలా చేసి సామాజిక న్యాయాన్ని చాటుకొని ఉంటే బాగుండేది. దానికి భిన్నంగా దళితులకు 1,293 కోట్లు, గిరజనులకు 440 కోట్లు, బిసిలకు 353 కోట్లు, మైనారిటీలకు 177 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 656 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దామాషా ప్రకారం న్యాయంగా కేటాయించాల్సిన వాటితో పోలిస్తే ఈ అంకెలు చాలా తక్కు వని అర్థమౌతుంది. అంతేకుకుండా బడ్జెట్‌లో కేటాయించిన వాటికన్నా చాలా తక్కువగా విడుదల చేస్తోంది. విడుదల చేసిన దాంట్లో కొంత దారిమళ్ళించగా, కొంత మిగులుగా చూపెడుతున్నది. చివరికి ఖర్చు పెడుతున్నది చాలా తక్కువైనపుడు, భారీ బడ్జెట్ అని ప్రభుత్వం చెప్పే దంతా పెద్ద మోసమని అర్థమౌతుంది. 90 శాతంగా ఉన్న ప్రజలకు 10 శాతాన్ని, 10 శాతంగా ఉన్న ధనికులకు 90 శాతాన్ని బడ్జెట్‌లో కేటా యించి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది. బడుగులను కొట్టి, బడా బాబులకు దోచిపెట్టే విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలి. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంఘం, ఆర్థిక-సామాజిక అధ్యయనా ల కేంద్రం ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఆరునె లల క్రితం రాష్ట్రంలో నెలకొన్న పేదరికంపై అధ్యయనం నిర్వహించాయి. గ్రామీణ ప్రాంతాల్లో 56.1 శాతం మంది పేదలున్నారని, వీరిలో 18.6 శాతం మంది కటిక పేదలన్న వాస్తవాన్ని అధ్యయనం తేల్చి చెప్పింది. అలాగే 80 శాతం మంది గ్రామీణులు నిర్ధారిత కేలరీల కంటే తక్కువ కేలరీలున్న ఆహారా న్ని తీసుకుంటున్నారనీ, పట్టణ ప్రాంతాల్లో సైతం 73 శాతం మంది పేదలు ఇలాంటి ఆహారలేమితోనే ఉన్నారన్న చేదు నిజాలను వివరంగా చెప్పింది. ఈ పరిస్థితుల్లోనైనా పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రాధాన్యతలతో కూడిన కేటాయింపులు జరపకపోవడం దారుణం. ఇప్పటికే 93,593 కోట్ల రుణ భారంలో రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోయిం ది. ప్రతి వ్యక్తిని సగటున 10,628 రూపాయలకు తాకట్టు పెట్టింది! అదే వైఖరిని ఇంకా కొనసాగిస్తోంది. గత బడ్జెట్‌లతో పోల్చినపుడు ఈ బడ్జెట్ లో ఎస్సీలకు 57 శాతం, గిరిజనులకు 39 శాతం, బిసిలకు 77 శాతం, మైనారిటీలకు 47 శాతం బడ్జెట్ పెంచినట్లు ఆర్థిక మంత్రి కాకిలెక్కలేసి చూపించారు. స్పెషల్ కాంపొనెంట్ ప్లాను కింద గత పదేళ్ళలో ప్రభుత్వాలు ఎస్సీల కు కేటాయించిన నిధుల్లో 13,000 కోట్ల రూనాయలను దారి మళ్ళిం చాయి. బకాయి పడ్డ నిధులను తిరిగి ఎస్సీలకోసం జమచేసే ఎటువంటి హామీ ఈ బడ్జెట్‌లో లేదు. ప్రత్యేక అంశ ప్రణాళిక కింద దళితుల సంక్షే మం కోసం ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించాల్సిన 8,000 కోట్లు పెద్ద మొత్తంగా కోతకు గురయ్యాయి. రెండు కోట్ల మంది ఎస్సీ, ఎస్టీల కోసం ఏర్పాటు చేస్తామన్న 'నోడల్ ఏజెన్సీ' ఏమైందో ప్రభుత్వం జాడ చెప్పదు. ప్రభుత్వ హాస్టళ్ళలో చదివే ఎస్సీ, ఎస్టీ, బిసి పేద విద్యార్థులు రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ఉన్నారు. విద్యా సామాగ్రి, భోజనాలు, బట్ట లు, కాస్మటిక్స్ తదితరాలకు గాను ఒక్కొక్క విద్యార్థిపై రోజుకు సగటున 20 రూపాయల చొప్పునైనా ఉపకారవేతనాలను ఈ బడ్జెట్ కల్పించలేక పోయింది. పేద వర్గాల విద్యార్థినీ, విద్యార్థులంతా స్కూళ్ళు, హాస్టళ్ళు వదిలిపెట్టి బాల కార్మికులుగా మారే ఆర్థిక విధానాలను ప్రభుత్వం అను సరిస్తున్నదన్న అనుమానం కేటాయింపుల వాస్తవాలను గమనించిన ఎవ రికైనా కలుగక మానదు. వృత్తికులాల వారైన చర్మకారులు, రజకులు, వడ్డెరలు, నాయీబ్రా హ్మణ, చేపలుపట్టే మొదలగు సెక్షన్ల ప్రజల సంక్షేమాన్ని ఈ బడ్జెట్ విస్మ రించింది. సంచార, అర్థసంచార జీవనం సాగిస్తూ భిక్షుక వృత్తిలో జీవించే సమూహాల సంక్షేమాన్ని అలాగే అత్యంత వెనుకబడిన తరగతులు, విక లాంగులు, జోగినులు, సెక్స్‌వర్కర్లు, వలస కార్మికులు, పారిశ్రామిక కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఈ బడ్జెట్‌లొ నామమాత్రం చేసింది. భూమిలేని దళితులు, ఆదివాసులు, వెనుకబడిన తరగతుల భూ అవస రాలను తీర్చడానికి బడ్జెట్ దోహదం చేసేదిగా లేదు. పేదరైతుల భూము లు గుంజుకుని, ప్రభుత్వ భూములను కలిపి విదేశీ సంస్థలకు చౌకగా ప్రభుత్వం కట్టబెడుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇలా భూము లన్నిట్నీ ఉన్నవాళ్ళకే సమర్పిస్తూపోతే, రానున్న వందఏళ్ళలో ప్రజావస రాలకు ఏం చేస్తుందన్నది ఊహించడం సాధ్యంకావడంలేదు. దళిత వర్గా ల సంక్షేమాన్ని అర 'చేతి'లో వైకుంఠంగా చూపి, ధనికులను మరింత ధని కులుగా మారుస్తున్న ఈ బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తు ఓట్ల కోసమే ప్రవేశపెట్టిందనిపిస్తోంది. ఈ బడ్జెట్‌లో 'హస్త' లాఘవంతో కూడుకున్న అంకెల మాయ తప్ప వాస్తవాభివృద్ధి కన్పించదు. -జూపాక సుభద్ర, కృపాకర్‌మాదిగ

Wednesday, February 20, 2008

అడ్డంకులు ఇన్ని ఉంటే ఐక్యత ఎలా?- కృపాకర్ మాదిగ


మాదిగ, మాల కులాలకు చెందిన కొంతమంది మేధావులు, నాయకులు, అధికారుల మధ్య రెండు కులాల ఐక్యతకు సంబంధించి ఇటీవల పలుదఫాలు చర్చలు జరిగాయి. మళ్ళీ జరగను న్నాయి. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని పక్కకుపెట్టి రాజ్యాధి కారం, భూమి, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు, నోడల్ ఏజెన్సీ, బకాయి పడ్డ స్పెషల్ కాంపోనెంట్ నిధుల సాధన మొదలగు అంశాలపై ఉమ్మ డిపోరుకు సిద్ధమౌదామని చర్చల్లో మాల మేధావులు, నాయకులు ప్రతిపాదించారు. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల వర్గీకరణ జరగ కుండా, అందుకు సహకరించకుండా మాలకులస్తులు అడ్డు పడినంత కాలం ఈ రెండు కులాల మధ్య ఐక్యత సాధ్యం కాకపోవచ్చని మాదిగ మేధావులు, నాయకులు తేల్చిచెప్పారు. ఇరువైపులా కొద్దిమంది మేధా వులు, నాయకులు వర్గీకరణ సమస్యకంటె రాజ్యాధికారం, భూమి, ఇతర ఉమ్మడి సమస్యల పరిష్కారమే ప్రధానమని అన్నారు. ఉమ్మడి వేదిక అన్నారు. సమైక్య ఉద్యమమన్నారు. కొద్దిమంది మాదిగ, మాల నాయకుల మధ్య ఐక్యత ముడిపడినట్టే కనపడింది. మాల నాయకులు, మేధావులు కొంతమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మాది గ దండోరా ఉద్యమాన్ని బలహీనపరచడానికి ఉన్నట్టుండి ఐక్యతా రాగాలు ఆలపిస్తున్నారు. ఉమ్మడి డిమాండ్ల సాధన కోసం తమతో కలసి పోరాడమని మాదిగ నాయకులకు పిలుపునిస్తున్నారు. కొద్ది మంది నిజంగానే నిజాయితీతో రెండు కులాల ఐక్యతకోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదిగలు, మాలలు ఐక్యం కావటానికి అవకాశాలు, ప్రాతిపదికలు, పరిస్థితులు ఎలా ఉంటే సాధ్యమౌతుందో మాదిగల వైపునుంచి విజ్ఞులైన మాల సోదరీ సోదరులకు కొన్ని ప్రతి పాదనలు నివేదిస్తున్నాము. దిగువ అంశాలలోని వాస్తవాలను, న్యాయబద్ధతను ఆచరణపూర్వకంగా మాల నాయకులు, మేధావులు, పెద్దలు అంగీకరించగలిగితే ఐక్యత సాధ్యమౌతుందని భావిస్తున్నాం.

(అ) జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగల రిజర్వేషన్లలో తమ తమ వాటాలు పొందటానికి మాదిగలు, రెల్లీలు, మెహతార్లు మొదలగు 59 షెడ్యూల్డు కులాల వారు చేస్తున్న డిమాండ్లు, ఉద్యమాలు న్యాయబద్ధమైనవని మాలలు గుర్తించాలి. ఈ మేరకు మాలల ప్రతినిధిబృందం ఒకటి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, యుపిఏ చైర్‌పర్సన్, రాష్ట్రపతి, జాతీయ ఎస్‌సి కమిషన్ చైర్మ న్, ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై కేంద్రప్రభుత్వం నియమిం చిన జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్‌ను కలవాలి. తక్షణమే పార్లమెంటులో ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం జారీచెయ్యాలని ఆ రాజ్యాంగాధి పతులు, అధికారులను కోరాలి;

(ఆ) ప్రభుత్వ-ప్రైవేట్ విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక అవకాశాలలో 59 ఎస్‌సి కులాలలో ప్రతి కులానికి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా అవకాశాలు కల్పించే సూక్ష్మస్థా యి పంపిణీ న్యాయసూత్రాలతో మాలలు ఏకీభవించాలి. ఉమ్మడి డిమాండ్ల సాధన కోసం మాదిగలు, మాలలు ఇతర షెడ్యూల్డు కులాల మధ్య రిజర్వేషన్ల వర్గీకరణతోనే ఐక్యతకు పునాది ఏర్పడుతుందని మాలలు అంగీకరించాలి. వర్గీకరణకు చొరవ తీసుకోవాలి;

(ఇ) రిజ ర్వేషన్ల వర్గీకరణ ప్రథమ ప్రాధాన్యంకల్గిన, ఉదాత్తమైన ఉమ్మడి లక్ష్యం గా మాలలు గుర్తించగలగాలి;

(ఈ) అన్ని స్థాయిల విద్యావకాశాల్లో, ఉద్యోగాల్లో, ఆర్థిక పథకాల్లో, రాజకీయ పక్షాల నాయకత్వాల్లో, పదవు ల ప్రాతినిధ్యంలో తమ జనాభా నిష్పత్తి కంటె అదనపు అవకాశాలు లభ్యమమవుతున్నప్పుడు, అటువంటి అదనపు అవకాశాలను మాల కులస్తులు వొదులుకోవాలి. అలా వొదులుకున్న అదనపు అవకాశా లను సరైన/కనీస ప్రాతినిధ్యం కోల్పోయిన మాదిగ, డెక్కలి, చిందు, బైండ్ల, రెల్లి, మెహతార్ మొదలైన మార్జినలైజ్డ్ షెడ్యూల్డ్ కులాలవారికి చెందేలా మాలలు బాధ్యత తీసుకోవాలి;

(ఉ) వర్గీకరణకు న్యాయ పరమైన, సాంకేతిక పరమైన అడ్డంకులను మాలలు కల్పించకూడదు. దళిత కులాల ఉమ్మడి సమస్యల పరిష్కారాల పంపిణీ న్యాయమే సామాజిక న్యాయమని, ఇందుకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల వర్గీకరణే సాధారణమని, ఇందుకు తామూ కృషి చేస్తామని మాలలు ప్రకటించాలి;

(ఊ) ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ రిజర్వేషన్లను ఏ ఎస్‌సి కులానికి చెందాల్సినవి ఆ ఎస్‌సి కులానికి చెందకుండా, ఉమ్మడి అవకాశాలను పెంచుకునే , ఉమ్మడి దళిత ఉద్యమాలను శక్తివంతంగా నిర్మించలేమని మాల వారు వొప్పుకోవాలి;

(ఎ) నాడు చుండూరులో బాధితులైన మాలలకు న్యాయం జరగనీయకుండా రెడ్లు 'సర్వజనా భ్యుదయ పోరాటసమితి'ని స్థాపించారు. దళితులపై దాడులు చేశా రు. నిన్న బిసి రిజర్వేషన్ల కల్పనకు వ్యతిరేకంగా అగ్రకులాలవారు 'సిటిజన్స్‌ఫోరం' స్థాపించారు. బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేసువేశారు. ఇదే మాదిరిగా నేడు ఎస్‌సిలలో అత్యంత అణ గారిన, వెనకబడిన మాదిగలు, రెల్లి, అనుబంధ కులాలవారికి రిజర్వే షన్ల వర్గీకరణతో న్యాయం జరగనీయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్, జాతీయ ఎస్‌సి కమిషన్ దగ్గర అడ్డు తగులుతున్న మాల నేతలను, మాల మహానాడు నాయకులను అసాంఘిక శక్తులుగా, దళిత వ్యతిరేక శక్తులుగా మాలవారు ప్రకటిం చాలి. వారి అపరాధాలను, ప్రాబల్యాన్ని మాలలే అంతం చెయ్యాలి;

(ఏ) దళితులు, ఆదివాసులు, బలహీన వర్గాల సంక్షేమం, సాధికారం, సామాజిక న్యాయసాధన గురించి వివిధ వేదికలపై గట్టిగా మాట్లాడు తున్న మాల నాయకులు ప్రతి దళిత కులానికి సూక్ష్మస్థాయి పంపిణీ న్యాయం చేకూర్చగల రిజర్వేషన్ల వర్గీకరణను సమర్ధిస్తూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాల మేధావులు ఇప్పటికైనా బహిరం గంగా ఎస్‌సిల వర్గీకరణను సమర్థిస్తూ ప్రజాస్వామిక విలువలను చాటుకోవాలి;

(ఒ) ఎస్‌సిల సంక్షేమంకోసం అన్ని ప్రభుత్వ శాఖల్లో లైజన్ ఆఫీసర్లు ఉన్న మాదిరిగానే ప్రతి దళితకులానికి రిజర్వేషన్లలో పంపిణి ప్రాతినిధ్యం కల్పించటంకోసం- వర్గీకరణ సూత్రం అమలు కోసం- ప్రతి ప్రభుత్వ శాఖలో ప్రత్యేక అధికారులను నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాలవారు విజ్ఞప్తిచెయ్యాలి;

(ఏ) చివరిగా మాదిగలు, మాలల మధ్య సాంఘిక ఐక్యత లేకుండా రాజకీయ ఐక్యత సాధ్యంకాదని మాలవారు గుర్తించాలి. మాదిగలతో కులాంతర వివా హాలు, పండుగలు జరుపుకోవటానికి, అన్నిరకాల మానవీయ, భౌతి క, ఆత్మిక సదుపాయాలు, సంతోషాలు పంచుకోవటానికి, మాదిగలకం టె తాము అధికులముకామని నిరూపించుకోవటానికి మాలనాయకు లు, మేధావులు ఆచరణాత్మకమైన సంసిద్ధతతో ముందుకు రావాలి. ఇవన్నీ జరిగినప్పుడే మాదిగలు, మాలల మధ్య నెలకొన్న అపోహలు, అనుమానాలు, ఈర్ష్యలు, స్పర్థలు తొలగిపోతాయి. నిజమైన సహో దరత్వం, సమానత్వం, సమైక్యత, సహజీవనాలు మాదిగలు, మాలల మధ్య నెలకొంటాయి. లేకుంటే అగ్రకులాల పాలకులకు వినోదాన్ని మిగిల్చే బానిస శిబిరాల మధ్య పోరాటం (గ్లాడియేటర్స్)గా మాదిగ మాలల జీవితం నడుస్తుంది! మాదిగలు, మాలల ఐక్యత విషాదాంత నాటకంగా మారే ప్రమాదముంది!

(ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి లో ది:17-02-2008 న ప్రచురితమయ్యింది. దీన్ని పాఠకుల సౌలభ్యం కోసం మళ్ళీ అందస్తున్నాం.)