Sunday, June 9, 2013

రాజీ పడ్డ రాత ( జూపాక సుభద్ర కథ, నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’ లో ది: 9-6-2013)

 రాజీ పడ్డ రాత
babyఅది సింగరేణి కాలరీస్ ఏరియ. బాగ సలికాలం. యిక్కడ అన్ని కాలాలు తడాకా సూపిచ్చేటియే. ఎండలు, సలి, వానలు. పొద్దుగాపూవరిదో పొద్దటి బదిలి (డ్యూటి) వున్నట్టుంది బొగ్గు బకీట అంటిచ్చిండ్రు. బకీట్ల బొగ్గు మండుతుందని ముసలోల్లు, ఆల్లతోని పిల్లలు గూడ వురికచ్చి దాని సుట్టు జేరిండ్రు. సలికి దాని సుట్టుజేరి ముచ్చట్లు పెట్టుకుంటుండ్రు, నవ్వుతుండ్రు. ఆ సప్పుడిని కండ్లు దెరిసిన. దుప్పటి దీసి లేవబోయిన. పక్కన్నే పండుకున్న అక్క ‘‘ఏందే దీన్ని నా పక్కల ఎయ్యద్దంటే యేస్తరు. యిదేమొ వూకె పురుగు మెసిల్నట్టు మెసుల్తది’’ అని దుప్పటి నిండగప్పింది నాకు. బైట బకీట నెగడు తలుపు సందుల్నుంచి యింట్లక్కనబడ్తంది. బైటి ముచ్చట్లు యిన బడ్తన్నయిగాని స్పష్టంగా వినబడ్తలేవు. నవ్వులు మాత్రం బాగా వినబడ్తన్నయి. ఆ నవ్వులు నిద్రబోనిస్తలేవు సరితను.

పక్కన అక్క కదిలితే కాలుస్త అన్నట్లన్నది. ‘అక్కడి నవ్వులు ముచ్చట్లకన్న నా అక్కెర దీర్సెటోల్లు కనబడకపోతరా... యింటింటికి బోయే బదలు ఒకకాన్నే శానమంది దొర్కుతరు. యిండ్లల్లకు బోతే వాల్ల పెద్దోల్లు ఎందుకు, ఏమిటని ఓ కన్ను, సెవు యిటే పారేస్తరు. ఎందుకచ్చింది, యిక్కన్నే దొరికిచ్చుకుందాం’ అనుకున్న. ‘గుంపున్నది అక్కడ అక్క గునుగుడేమున్నత్తియ్ గవెప్పటికున్నయేనాయె గీమె ఆర్సేది గాదు, తీర్సేది గాదు. కాపోతే దొర్కరు. పొర్కల్ల వడ్తరన్నట్లె వుంటరు’ అనుకొని దిగ్గున లేసి తలుపుదీసి బైటి కురికొచ్చిన. బైట వాకిట్ల అగ్గి బకీట సుట్టుగుంపు కాడికొచ్చి ‘‘జరుగుండ్రి జరుగుండ్రి’’ అని ఆల్ల మధ్యన అదాటుగ యిరికి కూసున్న.
‘‘అరే, ఏందే ఏంబడి పోతందే లావు సలిబెడ్తన్నాదే’’ అన్నది ఆ గుంపుల ముసలమ్మ జెర సందిచ్చుకుంట.

‘‘పరీచ్చలాటగాదె పిల్ల, సదువుకోక గీడి కురికత్తన్నవు. పొద్దుగాల లేసి సద్వుకోవాపూగని గీ పోరగాండ్లందరు గీ ముసలోల్ల ముచ్చెట్లి నుడేందే’’ కుంటి తాత కప్పుకున్న సెద్దరి యింక దగ్గరికి జరుపుకుంటీ ‘‘మేమత్తె మీకేమడ్డమత్తన్నం. కొంచెం సేపు సలిగాగి పోతం తియ్యి’’ అని సాయం జేసే మొకాపూవరన్నా వున్నరాని ఒక్క సూపు సూసిందందర్ని అగ్గి బకెట సెగకు అరిసేతులు కాపుకుంట.
‘‘రాత్తిరి మీ యింట్ల ఏం లొల్లే సెరిసగం రాత్రిదాక లొల్లే’’ దుర్గి పెద్దమ్మడిగింది నన్ను. ‘‘ఏమో నేను గా లొల్లంతిండ్లే. నిదురబొయిన’’ అన్న బకిట్ల పుల్ల బెడుతూ...
‘‘గంత లొల్లయినా సోయిలేదే నీకు? గట్టెట్ల నిద్రవడ్తదే... నిదుర పాడుగాను, కన్ను బొడ్సుకున్నా గింత నిదురరాదు. కోడికి నాకు తెల్లారలె....’’ అగ్గి బకెట కాడ గూసున్న మల్లమ్మ ముసల్ది గునిగింది.
‘‘పసి పోరగాండ్లు ముసలోల్ల మొక దుర్గి పెద్దవ్వ. యింతల మా దోస్తు లీల వురికచ్చి నిల్చున్నది.
‘‘ఆ... అచ్చినవా రారా... అగో మీ దోస్తు ఆడ కూసున్నది’’ ఆ గుంపుల్నుంచి వొకరు సెప్పంగనే లీల నా పక్కకొచ్చి యిరికింది.

‘‘యిప్పుడే లేసినవా’’ అన్న పొక్కల పుల్ల బెడుతూ., మండేటప్పుడు బైటికి తీస్తూ. అగ్గి బకీటు పొక్కల పుల్లబెట్టి మండేటప్పుడు బైటికి దీసి ఆ మంటను చూసి సంబరపడి సల్లారినంక మల్లా ఆ పుల్లను బకీటు పొక్కల బెట్టడం, తీయడం, యిదో ఆట మాకు....
‘‘లేదు యిల్లూడ్సి బాసాండ్లు బైటేస్తుంటె మీ లొల్లి యినవడి సేతులు కాపుకుందామని వచ్చిన’’ అని చేతులు కాపుకుంటూ అన్నది.
‘‘రాత్రి టీవీల సీరియల్ సూసినవా’’ అడిగింది కుతూహలంగ లీల.
‘‘ఏమో నేం జూల్లే’’ అన్నాను నిర్లిప్తంగ.
‘‘గీల్లకు ఏమైన సీన్మ ముచ్చెట్లు, టీవీల ముచ్చెట్లే కావాలె దుర్గి పెద్దవ్వ. రాన్రాను లోకం బట్టెబాజిదయితంది. గా టీవి ఎప్పుడన్న ఉప్పుస కోసం సూద్దామంటే రోతత్తది. ఆల్లు ఎక్కడోల్లో ఏమో మన మాటగాదు, మన లెక్కగాదు, మన బట్టబాతలె వుండయి. ఎక్కడి మనుసులో ఏందో....’’ అని ఎల్కటి తాత అనంగనే సుట్టు కూసున్న పిల్లలు బాగ నవ్విచ్చిండ్రు. ‘‘కాలం గిట్ల మారవట్టె మనమేం జేత్తమే మామా! లెల్లోల్లం గాదు, తప్పెటోల్లం గాదు. గీల్లకన్ని నవ్వులాటలే, పిల్ల సేట్టలు’’ అన్నది నర్సవ్వ కొంగునిండ గప్పుకుంట...
నేను గీ ముచ్చ నాకు ఎవరు సాయంజేత్తరో అని కూసున్నోల్ల గుంపుజూసిన. రవి, రమేష్, లీల, సరిత, శ్రీను వున్నరు. ఎవల మాటలు వాల్లు మాట్లాడుకుంటాంటె మెల్లగ వొక్కొక్కరి దగ్గెరికి బోయి ‘‘నీకు రెండు పెన్నులున్నయా’’ అని అడిగిన గుసగుసగా. వాల్లు గూడ అదే గుసుగుసతో ‘‘లెవ్వంటె లెవ్వన్నరు’’ నాగుండె డక్కుమన్నది. అంత సలిల గూడ నా వొల్లంత కాకెక్కింది.


ఏం జెయ్యాలె, మా యింట్ల పన్నెండు మందిల నేనే సిన్నదాన్ని. లేకలేక సదివిస్తుండ్రు. 6వ తరగతి సద్వుతున్న. ఓ దిక్కు అవ్వయ్య గావురం, యింకో దిక్కు అన్నలు, వదినెలు, అక్కలు ‘బాగ సదువాలె, కిలాసుల ఫస్టు రావాలె. లేకుంటే బొక్క లిరుగుతయి’ అనేటోల్లు. గీల్లందరి కండ్లల్ల పడి వుండేది. గీల్లందరు నా మీద చాన స్ట్రిక్టు. గా బెస్తోల్ల రజిత ఎట్ల సదువుతది. గా సాకలోల్ల పిల్ల ఎంత మంచిగ వుషారుగుంటదని వాల్లకు నచ్చినోల్ల బుద్దులన్ని నా మీద రుద్దెటోల్లు. ఏం గొనిచ్చినా వాల్లకు యాదొచ్చినప్పుడు తిరిగి ఆల్లకు మల్ల సూపియ్యాపూనని అడిగెటోల్లు. స్కూల్లు మొదలైనప్పుడే నాలుగు స్కూలు యూనిఫాములు, ఒక బ్యాగు, పుస్తకాలు సరిపోయే నోట్‌బుక్స్, టెక్ట్స్‌బుక్స్, రెండు పెన్నులు, నాలుగు పెన్సిల్లు, రెండు జతల చెప్పులు, మూడు జతల రిబ్బండ్లు యాడాదికని లెక్క జెప్పి తెచ్చేది. ‘పంటన్న యాడాదికి రెండుసార్లింటి కొస్తది. నాకేమో యాడాదికి వొక్కసారే. ఒక్కసారే దిక్కుమొకం లేకుంట గొని పారేసి మల్లా యాడాద్దాక గది లేదు, గిది లేదని’ అడుగొద్దు. గిదీ నా సౌలతు.

తెచ్చినప్పుడు చాన సంబురపడేది. మా క్లాసోల్లు దోస్తులు కూడా ‘‘అబ్బా వొక్కసారే అన్ని కొనిబెడ్తరు మీ వోల్లు మంచోల్లు, గొప్పోల్లు’’ అని మొకాలు పెద్దగ జేసేటోల్లు. నేనో పెద్ద ఫుడింగ్‌లాగ పొంగిపోయేది. ఒక్కసారి గవన్ని ఒక్కకాడ చూసుడు మంచిగనే వుండేది. కని వాటిని యాడాదంత దాసుకునుడు, కాపాడుకునుడు వశంగాక పోయేది. యింట్ల, క్లాసుల దొంగ దొర కొట్టకుంట సూసుకొవాలె. దాని కోసం యింట్ల అక్క పిల్లల, అన్న పిల్లల కన్నుబడని జాగల దాసుకునేది. పెన్ను పెన్సిల్లను గోడ సూర్ల, బియ్యం బస్తాలల్ల, దుర్గమ్మ తొట్టెల, బోనం కుండల్ల దాసుకునేది. పాత బట్టలు, సినిగిన బట్టలతోని మూటగట్టిన మెత్తల్ని యిప్పి అండ్ల కొన్ని, అండ్లకొన్ని నోటు పుస్తకాలు పెట్టి మల్లా ఎప్పట్లాగె కట్టి ముడేస్తుంటిని. యిన్ని జేసినా గూడ పోతనే వుండేయి.

మెత్తల సీమలున్నయని యిప్పినప్పుడు నోట్సులుంటే అవ్వి తీసి బైటేసుడు. బోనం కుండల్ల దాసుకున్నయి గూడ పండుగలప్పుడు బైటేసి ఏడ బడ్తె ఆడ బెట్టడం వల్ల నోట్సులు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు పోయేవి. యిక క్లాసుల కూడ బాగ దొంగతనాలు జరిగేయి. ఇది వరకు ఒకటి బోయి ఒకటన్న వుండేది. ఈసారి ఆర్నెల్ల పరిక్షలకే కొనిచ్చిన మూడు పెన్సిల్లు, రెండు పెన్నులు పోయినయి. మైసమ్మ మాయం జేసినట్టు బోయే నా వస్తువుల్ని ఎట్ల గాపాడుకోవాల్నో తెలువకపోయేది. ఆర్నెల్ల పరీక్షలు యింకా రెండ్రోజులే వున్నయి. ‘పరీక్షలు ఎట్లా రాయాలె? ఏం జేయాలే దేవుడా గీ పెన్ను ఎక్కన్నుంచన్న పుట్టియ్యి దేవుడా’ అని బుక్కుల్ల దేవుని బొమ్మల పేజీల నెమలీకలు బెట్టి మొక్కుకునేది.

పరీక్ష రాయనీకి అందరికి పెన్నులు కావాలె. ఎవరిత్తరు? ఎవరికన్నా రెండు పన్నులుంటె బాగుండు. ఎవరికున్నయని పేరు పేరునా తీసిన. యింక ఒక్క పెన్సిలు మిగిలింది. యిది యింట్ల దెలిస్తే నా తెలివి తక్కువతోని బోయినయని గింత సోయి లేదని కొట్లు, తిట్లు. అవి పడుడు నా వశం గాదు. పోనీ వీల్లు సద్వుకున్నోల్లు గూడ కాదు. సద్వితే వీళ్ళ దగ్గెర పెన్నులుండెయి. దొంగతనంగానైనా కొట్టేద్దును. ఆల్లకు అంత సీను గూడ లేకపాయె. ఎట్ల ఏం జెయ్యాలనని క్లాసుల శ్రీను, రవి, జమున, యాదమ్మల దగ్గర రెండ్రెండు పెన్నులుండంగ చాన సార్లు జూసిన. మిగతోల్ల దగ్గర ఒక్కొక్క పెన్నే వుండేది.
రవి, జమున, శ్రీను వాల్లిండ్లు దూరం మా యింటికి. యాదమ్మ యిల్లు మా యింటెన్కనే. పోయి అడుగుదాము. యీమే యియ్యకుంటె వాల్ల దగ్గెరికి పోవచ్చని నిర్ణయించుకొని యింట్ల ‘మా క్లాసామె యాదమ్మింటికి పోతన్న’ అని చెప్పి పోయిన. పోయె వరకు యాదమ్మ గిన్నెలు తోముతంది కూసోని. నన్ను జూసి ‘‘ఏంది సద్వుడయిందా? నీకేంది నువ్వు క్లాసుల ఫస్టాయె.

నీకు పరీక్షలప్పుడే సద్వాలనేమున్నది’’ అన్నది పీసుతోని బూడిద్దిసుకుంట. వాల్లమ్మ యింట్లున్నది. నేనటిటు జూసి యాదమ్మ దగ్గెరికి బోయి వట్టిగనే కాల్లమీన కూసున్న. గిన్నెల్ని దగ్గెరికి జరుపబోయిన. యింకా ఆమెను మెహర్బాని సెయ్యనీకి ఆమె తోమినయి కడగబోయిన. ‘‘వద్దు, మామ్మ జూస్తే గిన్నెలు ముట్టుడైనయని మల్లా తోమ్మంటది. దూరమే కూచో అన్నది. క్లాసుల నేనెట్ల చెప్తె అట్ల వినే యాదమ్మ, బైట నేను కొరికిన జాంకాయ తినే యాదమ్మ, వాల్లింటికాడ నన్ను దూరముండనుడు కార్జం కలుక్కుమన్నది. అయినా, ‘‘ను సదువుతున్నవ్? అన్ని నేర్చుకున్నవా?’’ అన్న మామూలుగ.
‘‘నాకు సద్వుడే అయితలేదు. సుట్టాలచ్చి పనెక్కువైంది. యింకా వూడ్సుడు, తోముడు, కడుగుడు, అలుకు పూతలు. గింత తీర్తలేదు యింట్ల’’ అన్నది యాదమ్మ.
యిగ యాదమ్మ వాల్ల నాయిన సద్వుకున్నడు. బాయిల పనైనా మీది పనే జేత్తడు. జేబుకు పెన్ను వెట్టుకొని తిరుగుతడు. ఆమెకు యిద్దరన్నలు. పదో తరగతి, ఇంటరు సదువుతుండ్రు. వాల్లు సదివిన, రాసిన నోట్సులు, పెన్నులు, బుక్కులు అన్నీ యాదమ్మకే. యాదమ్మకు ఈ పని పాటలే యిష్టం. సదువు పెద్దగ పట్టించుకొనేది గాదు. ఒక్కతే బిడ్డని పావురం.

‘‘ఏదో పేపరు తెల్సేవరకన్న సదివితే సాలు. ఆడపిల్లకు సదు పనిమంతురాలు కావాలె. రేపు ఎవనికన్న యిత్తే ‘నీయమ్మ నీకేం పని నేర్పిందే’ అని నన్ను దిడ్తరు అని వాల్లమ్మ అమ్మలక్కలతోని అంటుంటది.
యిట్లాంటియన్ని యిని యాదమ్మ ఏదో టైంపాస్ కన్నట్లు క్లాసుకొచ్చేది. చాన డాబు గొచ్చేది. సేతులనిండ గాజులు, తలనిండ పూలు, మెడగ్గొలుసు, కాల్లకు పట్టగొలుసులు, మంచి బట్టలేసుకొని వచ్చేది. బ్యాగునిండ పుస్తకాలు, ఒక బాక్సునిండ పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు నింపుకొని వచ్చేది. అవన్ని జూసి మా సారు ‘‘బ్యాగునిండా పుస్తకాలు, బాక్సు నిండా పెన్నులు గాదు. తలనిండా అక్షరాలుండాలె’’ అనేటోడు. మొత్తానికి క్లాసంతా యాదమ్మను ‘సుద్దమొద్దు’ అని సాటుకు అనుకునేటోల్లు. కాని, యాదమ్మకు రాసిన నోట్సు యిచ్చి ఆడిపిచ్చుకునేది క్లాసుల నేనొక్కదాన్నే.

మెల్లగ ఆ స్నేహంతోనే ‘‘యాదమ్మా నా పెన్నులు పోయినయి...’’ అన్న మొకం దీనంగ బెట్టి.
‘‘పోయినయా కొనుక్కో. ఎల్లుండి నుంచే గద పరీక్ష’’ అన్నది కడిగిన గిన్నెలు తీస్కుంటా...
‘‘పోయినయని చెప్తె యిండ్ల కొడ్తరు గద. యాదమ్మా నీకు తెల్సుగద మా అన్నపూట్లాంటోల్లో...’’
‘‘మరేం జేత్తవు’’ యాదమ్మ అయోమయంగ...
‘‘నీ దగ్గర చాన పెన్నులుంటయి గద, నాకొక పెన్నియ్యవా... మంచిగ పడేది’’ అన్న బెంగగా...
‘‘నా దగ్గెర మా అన్నలయి, నాయినయి పెన్నులు చాన్నే వున్నయి గనీ అన్ని మంచిగ పడయి’’ యాదమ్మ గిన్నెల్ని అరుగుమీద బోర్లిస్తూ...
‘‘రెండు మూడన్నా మంచిగ పడవా’’ అన్న అరుగుమీన కూసుంటూ. ‘‘పూర్తిగా కాదు. పరీక్షలయి పోంగనే యిస్త’’ అన్న కొంచెం జాలిగ..
‘‘వుత్తగనే యియ్యాల్నా’’ యాదమ్మ నా కండ్లల్లకు జూస్తూ...
‘‘మల్లిత్త గద, నీకే’’ అన్నాను. నేనుగూడ అట్లనే జూస్తూ...
‘‘రాసినంక యిత్తవు. రాసేటప్పుడేమిత్తవు’’ యాదమ్మంది కండ్లు కిందికేసి...
‘‘ఏమియ్యాలె? పెన్నిచ్చి నా పరీక్షల గండం గట్టెక్కిస్తే ఏమియ్యమన్నా యిస్త’’ అన్న.
‘‘ఏం లేదు. పరీక్ష రాసేటప్పుడు నువ్వు రాసేది నాకు సూపియ్యాలె’’ అన్నది.
‘‘ఓ దాందేమున్నది, పేపరు మొత్తం నీ ముందట బెడ్త తియి’’ అని ఒప్పుకున్న.
పెన్ను పోయిన బాదముందు, టెన్షన్ ముందు యింట్ల చెప్పుకోలేని మాట ముందు గీ పరీక్ష పేపరు సూపిచ్చుడు ఒక లెక్కా. అందులో యాదమ్మ మా యింటికి రాదు. వచ్చినా చెప్పదని గ్యారంటీ. నాలాగ అందరిండ్లకు బోదు. వాల్లోల్లు యింట్లకాలు బైట వెట్టనివ్వరు. చలో ఏదయితే అదయింది. పెన్ను దారి దొరికింది. యీడికింతే నేను బంగారు కొండననుకున్న. ‘‘యిస్తవా యిప్పుడు’’ అడిగిన వెంటనే, ఓ దిగులు తీరిందని ఆనందంతోని. యాదమ్మ మొకంగూడ ఏదో దిగులు దించుకున్నట్టున్నది. ‘‘మా అమ్మ యింట్లున్నదే. ఆమె లేనప్పుడు యిస్త’’ అని చెప్తే ఏ అనుమానం లేక యింటికి బోయిన. తెల్లారి వాల్లమ్మ లేంది జూసి పోయి పెన్ను తెచ్చుకున్న.

ఎర్ర మూత పెన్ను చాలాబాగుంది. మంచిగ పార్తంది. పెన్నుపోయినప్పట్నించి బాగ దిగులుండె. యాదమ్మ దయవల్ల యింట్ల పెన్ను సంగతి తెల్వకుంటయింది. యింకోటి పరీక్షలు ఎట్ల రాసి గట్టెక్కాలనే టెన్షన్ బోయింది. పరీక్షలైపోయినంక ఏ సంగతైన తర్వాత జూడొచ్చు. యిప్పుడైతే గీ ఆపతి తీరింది. అని హాయిగ ముర్సుకుంటు పరీక్షలకు సదువుకున్న. జవాబులు గూడ యాది మరుపులేకుండా కండ్లల్ల మెరుస్తున్నయి.
మొదటి రోజు తెలుగు. సార్ తెల్ల పేపరు, కొచ్చెన్ పేపరిచ్చిండు. నా యెన్క యాదమ్మ కూసున్నది. నా చేతిల పెన్ను వైపు యాదమ్మ చూస్తుంది. నాకర్థమైంది ఆ చూపుకుండే అర్థం. ‘నువ్వు జెప్పినట్టే జేస్త’ అని ఒక్క నవ్వు నవ్విన యాదమ్మను జూసి.

పెన్ను నా కన్న ముందే వుర్కుతంది తెల్సిన ప్రశ్నలొచ్చినయని. అట్లా తెలుగు, ఇంగ్లీషు పరీక్షలు నేను రాసిందంతా ఎక్కించింది యాదమ్మ. ‘అదృష్టవంతురాలు ఏం జద్వకుంటనే రాసి మార్కులు దెచ్చుకుంటుందే పెన్ను పుణ్యమా’ అని అనుకున్న. ఇంగ్లీషు, హిందీ పద్యాలు, ఆన్సర్స్, గ్రామర్ అంతా బట్టి పట్టేది. అంత బట్టి పట్టి ముక్కున వుంచుకున్న నరాలబాధ, ఎవరికి చెప్పుకోలేని సదువు కోత... చాలా అవస్థనిపించింది. కడుపు నిండా తింటే నిద్రొస్తదని కడుపు సంపుకొని కొంచెమే తిని నిద్రగాసి అర్థం గాని దాన్ని బలవంతంగా మెదట్ల ముండ్లను నాటినట్లు నాటిన. పరీక్షలప్పుడు పీకేసేటియే కదాని. (పేపరు తెలుగే కానీ మేమ్మాట్లాడే తెలుగే గాదాయె...)

యిట్ల సద్వు సద్వుకొని రాస్తే... ‘యాదమ్మ మాత్రం సద్వుకోకుంట మంచిగ తిని, నిద్రబోయి నీట్‌గ తయారై బొట్టు బోనం దిద్దుకొనొచ్చి మొత్తం నా పేపరంత కాపి కొడ్తంది’ అని తిట్టుకున్న. నేను చేసిన లెక్కలన్ని ఎక్కిస్తుంది వెనుకనుంచి. నాకు చాలా జెలసి, కోపమొచ్చిందో పెన్ను ఒప్పందం మర్సిపోయిన. రాసే పేపరు మీద యింకో పేపరు పెట్టి కనిపించకుండా రాస్తున్నా..
‘‘పేపరు తియి’’ మామూలు గన్నది యాదమ్మ.

నేను పట్టించుకోనట్లుగా రాస్తున్నాను అట్లనే...
‘‘నా పెన్నియ్యబ్బ’’ అంది కొంచెం గట్టిగ...
ఆ మాటకు నా దిమ్మ దిరిగింది. ‘‘పెన్నిస్తే ఏం రాస్తా?’’ అని అడ్డు పేపరు తీసేసిన అసహాయంగా....
- జూపాక సుభద్ర,
98499 05687

Monday, July 5, 2010

అణగారిన అస్తిత్వాల్ని అణగదొక్కడమే మార్క్సిజమా?

రంగనాయకమ్మ వేసుకున్న ప్రశ్నలు చెప్పుకున్న జవాబుల గురించి మాట్లాడే ముందు 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' నేపథ్యం వివరించాల్సిన అవసరముంది. జనవరి 2009లో విశాఖలో నిర్వహించిన సభలో దళిత బీసి మైనారిటీ అస్తిత్వాల రచయిత్రులు కొన్ని ప్రతిపాదనలు, చర్చలు లేవదీయడం జరిగింది. లక్ష్యాలు కూడా రూపొందించడం జరిగింది.

పురాణాల నుంచి ఆధునిక స్త్రీవాద సాహిత్యం దాకా అణగారిన జాతుల (దళిత బహుజన మైనారిటీ ఆదివాసీ) స్త్రీలను మరుగుపర్చడం జరిగింది. ఈ సాహిత్యాలేవీ వీరి స్థితిగతుల్ని సమస్యల్ని కుల, శ్రమ దోపిడీని, సంస్కృతిని పట్టించుకోలేదు. చర్చించలేదు. సమాజానికి ఉత్పత్తి శ్రమనందించే అణగారిన స్త్రీలను సాహిత్యంలో భాగం చేయలేదు. వీరిని వూరిలో అంటరానోల్లని చేసినట్లే సాహిత్యంలోనూ దూరముంచారనే అవగాహనని సభ ముందుంచాము.

సమాజంలో స్త్రీలు కూడా కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా దొరసానులుగా, కూలీలుగా వున్నారు. వారి జెండర్ సమస్యలు ఒకే మూసగా లేవు. అణగారిన జాతుల స్త్రీల సమస్యలు, గడపదాటని దొరసాండ్ల సమస్యలు ఒక్కటి కావు. ఇలాంటప్పుడు స్త్రీలంతా ఒక్కటే అని చెప్పడంద్వారా అణగారిన జాతుల స్త్రీల సమస్యల్ని చర్చించే అవకాశం లేకుండాపోతుంది.

పురుషాధిక్యత నుండి విముక్తే స్త్రీలందరి విముక్తిగా ఆధిపత్య కులాల మహిళలు చెప్పడం యితర స్త్రీల చుట్టూత వున్న రాజకీయ ఆర్థిక సాంఘిక శ్రమ కుల సమస్యల్ని మగ పెత్తనాల సమస్యల్ని వెలుగులోకి రానివ్వకుండా అణచివేయడమేనన్న విషయాల్ని సభ అంగీకరించింది.

స్త్రీవాద సాహిత్యం ప్రధానంగా కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల నుంచే వచ్చింది. ఈ సాహిత్య ఉధృతి, ఉత్పత్తి పెరిగినా, తరిగినా మెజారిటీ స్త్రీలైన దళిత బహుజన మైనారిటీ ఆదివాసీ స్త్రీలకు ఒరిదింది, తగ్గింది ఏమీలేదు. ఈ అస్తిత్వాల స్త్రీలకు కులం ప్రాంతం మతం మగాధిపత్యం, ఆసామి అజమాయిషి, దొర్సాని పెత్తనాలు అంటరానితనం అణచివేతలున్నాయి.

ఈ అణచివేతల నుండి వీళ్లు విముక్తి కావలసివుంది. 'స్త్రీవాదం' అనే పదం యిన్నాల్లు కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల సమస్యలకే పరిమితమైవుంది. ఉమ్మడి వేదికకి ఈ పదం యిమడదని అనగా విస్తృత అస్తిత్వాలుగా వున్న అణగారిన స్త్రీలకు సరిపోదు అనే అభిప్రాయాన్ని సభ ఆమోదించింది.

అయితే మా ఈ చర్చల్ని, ప్రతిపాదనల్ని, ఆమోదాల్ని, దానికి సంబంధించిన రిపోర్టును పక్కనబెట్టి సభలో వీగిపోయిన శ్రమ సంబంధాల స్త్రీల సాహిత్య, శ్రమ తప్ప వేరే అస్తిత్వాలు లేవనే వాదన రిపోర్టు పత్రికల్లో రావడం జరిగింది. సభా నిర్వాహకులు ప్రత్యక్షంగా వ్యతిరేకించకపోగా పరోక్షంగా అనుకూలతను వెలిబుచ్చడం జరిగింది. సభా చర్చలు ఆమోదాలు ఎక్కడా వెలుగు చూడలేదు. యిలాంటి అణగదొక్కే అనుభవాల అవమానాల్తో వీరి ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా అణగారిన అస్తిత్వాల రచయిత్రులు 'మట్టిపూలు'గా సంఘటితమయ్యారు.

ఒకవైపు దళిత బహుజన మైనారిటీ రచయిత్రుల అభిప్రాయాల్ని అతి దారుణంగా అణచివేసి యిప్పుడు 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' అని పెట్టుకున్న ఆధిపత్య కులాల రచయిత్రులు మరోవైపు తమ అనుకూలురైన అణగారిన కులాల రచయిత్రుల్ని వేదికలో పెద్దపీటలేసి తమ ఆధిపత్య జెండర్ ప్రయోజనాల్ని కొనసాగించే పనిలో పడ్డారు. తద్వారా అణగారిన జాతుల స్త్రీలను అణచివేసే కార్యక్రమం పెట్టుకున్నారు. విశాఖ సభలో ఓడిపోయిన, కాలం చెల్లిన వాదనలు అణగారిన స్త్రీల భిన్న అస్తిత్వాల పుటంలో బూడిదైన వాదాన్ని రంగనాయకమ్మ మార్క్సిస్టు పుటంలో పెట్టి వూదుకుంటున్నారు.

నిజానికి ఈ చర్చా పాఠం సందర్భం స్త్రీల భిన్న అస్తిత్వాల మీద జరగాల్సినది. స్త్రీల భిన్న అస్తిత్వాల చుట్టూ అల్లుకుపోయిన దోపిడీ కుల రాజకీయాల గురించి జరగాల్సిన చర్చ. కాని రంగనాయకమ్మ చాలా పకడ్బందీగా ఆ ప్రస్థావనే లేకుండా, లేవదీయకుండా జాగ్రత్త పడింది. అస్తిత్వమంటే ఏమిటి? అని ప్రశ్న వేసుకొని జాతుల్లో కులాల్లో మతాల్లో తేడాలున్నాయని జవాబు చెప్పుకుని స్త్రీలల్లో వున్న ఎక్కువ తక్కువల వూసుగాని, ప్రస్థావన గాని చేయకపోవడం ద్వారా ఆధిపత్య కుల దొర్సానితనాన్నే ప్రదర్శించింది. అణగారిన స్త్రీల అస్తిత్వాల్ని తొక్కేసింది.

కులమనేది శ్రమవిభజనే కాదు శ్రామికుల మధ్య విభజన కూడా సృష్టించిందని అంబేద్కర్ చెప్పాడు. నేడు సమాజంలో వున్న భిన్న అస్తిత్వాల మీద చర్చ నడుస్తున్నది. కాని భిన్న అస్తిత్వాలతో వున్న మహిళలకు సంబంధించిన అస్తిత్వాల చర్చకు మాత్రం అవకాశం యివ్వడం ఆధిపత్య కుల స్త్రీలకు యిష్టంలేదు. మా సమస్యలు వేదిక లెక్కడం లేదు. వెలుగు చూడ్డంలేదు.

సాహిత్యంలోనూ అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నాం. మా సమస్యల్ని ఆధిపత్య కుల మార్క్సిస్టు రచయిత్రి అర్థం చేసుకోగలదా? అస్తిత్వాలు అర్థం కావాలంటే కులవ్యవస్థను అర్థం చేసుకోవాలి. కుల సమాజంలో పుట్టి ఉత్పత్తి శక్తుల్ని, ఉత్పత్తి సంబంధాల్ని మానవ సంబంధాల్ని నియంత్రించేది, నిర్దేశించేది కులం కాదు అని ఎట్లా చెప్పగలము.

ఆమె ఏకరువు పెట్టిన కార్మికులు, పెట్టిబడిదారులు కూడా కుల వ్యవస్థ పునాదుల్లోనే వున్నారని తెలవదా! ఇక్కడ సమాజిక సాంస్కృతిక రూపం నిర్ణాయక మౌళిక అస్తిత్వం కులమే అని అనుభవంలోకి రావాలంటే అణగారిన కులాల్లో స్త్రీగా పుడితేనే తెలుస్తుంది. అణగారిన కులాలవాళ్లే శ్రమ చేసేవాళ్లుగా, ఆధిపత్యకులాలవాళ్లే శ్రమని దోచేవాళ్లుగా వ్యవస్థీకృతంగా ఎందుకు కొనసాగుతున్నారో చర్చ చేయండి. ఆ చర్చకోసం ప్రశ్నలు వేసుకోండి.. యింకా అస్తిత్వాలు బాగా అర్థం అవుతాయి.

రోడ్లూడ్చే, పాకీ, పారిశుధ్య శ్రమలో ఆధిపత్య కులాలవాళ్లు ఎందుకు లేరు? దళిత కులాలవాళ్లే ఎందుకున్నారు? యిది శ్రమ విభజనా? కుల విభజనా? కులం సృష్టించే మానవ, ఉత్పత్తి సంబంధాల్ని, సంస్కృతుల్ని వివక్షల్ని మార్క్సిజం వంటి సిద్ధాంతాలు ప్రశ్నించలేవు, పరిష్కరించలేవు. ఈ విషయాలు లేవనెత్తిన కులాల్ని బహుజన ప్రయోజనాల్ని దెబ్బతీసే వాదాల్తో అణచివేస్తున్నాయి. మార్క్సిజంని వ్యక్తిగత ఆస్తిగా చూసే రంగనాయకమ్మ కూడా తన చర్చా ప్రశ్నల్లో మూసేసింది. ఆధిపత్య దోపిడీ గురించి మాట్లాడే యీ రచయిత్రి అణగారిన స్త్రీలపై వుండే ఆధిపత్యాలపట్ల మౌనం వహించి మరుగున పడేసింది.

సామాజిక అసమానతల్నుంచే అస్తిత్వాలేర్పడ్డాయని, అసమానతలు పోయిన్నాడే అస్తిత్వాలు పోతాయని యీ రచయిత్రికి తెలవ దా? అస్తిత్వాలంటే హక్కులు సాధించుకునేందుకు సాధనాలుగా వున్నాయని అస్తిత్వాల్ని చులకన చేసి అవమానించడం ఆధిపత్య కుల అహంకారానికి నిదర్శనం. అస్తిత్వ పోరాటాలు అస్తిత్వాల్ని మోయడానిక్కాదు, నిర్మూలించడానికే.

హక్కులు, అవకాశాలు, స్వేచ్ఛ ఉన్న కులాలకు అవి సాధించుకోవాల్సిన అవసరం లేదు. అవి సాధించుకోడానికి అస్తిత్వాలుగా కదులుతున్నారంటేనే వాళ్లెంతగా హక్కులు కోల్పోయారో, ఎంతగా హక్కులు కొల్లగొట్టబడినారో అర్థం చేసుకోవచ్చు. కులం వల్ల అన్నీ అమరిన వాళ్లకేం అర్థమవుతాయి హక్కుల్లేని అస్తిత్వాలు! మొత్తానికి ఆధిపత్య కుల మార్క్సిస్టు రచయిత్రి మేమెదుర్కొంటున్న ఎన్నోరకాల అణచివేతలకు సంబం ధించిన అణగారిన స్త్రీ అస్తిత్వాల్ని చర్చ చేయకుండా తొక్కేసింది.

పురుషాధిపత్యం పోవాల ని కోరుకుంటున్న ఆధిపత్య కులాల స్త్రీలు అణగారిన స్త్రీల అస్తిత్వాల్ని అణగదొక్కడం, పూడ్చేయడం ప్రజాస్వామికం కాదు, ఆధిపత్య కుల మార్క్సిజమే.

అణగారిన కులాల స్త్రీలపై ఆధిపత్య కులాలు చేసే అన్ని రకాల అణచివేత రాజకీయాల్ని ఎదించడానికి దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ రచయిత్రులంతా సంఘటితం కావాలి.

- జూపాక సుభద్ర

(Andhra Jyothy vividha 5-7-2010)

Monday, June 29, 2009

అస్తిత్వ సాహిత్యాలను ఎదగనివ్వడమే నేటి ప్రజాస్వామ్యం

గురజాడ, చలం, శ్రీశ్రీ శత జయంతి, వర్ధంతి కార్యక్రమాలను, సంస్మరణ ప్రత్యేక సంచికలను, ప్రత్యేక కథనాల ప్రసారాలను ముమ్మరం చేసారు. ఇదంతా రచనా రంగంలో ఆధిపత్య కులాల పెత్తనాలను కాపాడుకునే ప్రయత్నాలే! తెలుగులో అస్తిత్వ సాహిత్యాలు బలంగా ముందుకు సాగుతున్నాయి. మాదిగ, దళిత, ముస్లిం, దళిత క్రైస్తవ, తెలంగాణ, బిసి సాహిత్యాలు ఇందుకు నిదర్శనం. మాదిగ సాహిత్య వేదిక, దండోరా- మైసమ్మ- ఏకలవ్య ప్రచురణలు, గుంపు సాహితి, భాగ్యనగర్ బుక్‌ట్రస్టు లాంటి అనేక ప్రచురణ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇపుడు మరో అడుగు ముందుకుపోయి ఎస్సి ఎస్టి బిసి మైనారిటి రచయిత్రుల వేదిక 'మట్టిపూలు' పరిమళం మొదలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ సాహిత్యం వస్తూనే ఉంది. ఈ సాంస్కృతిక పునర్జీవనం కోస్తాయేతర ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణ కేంద్ర బిందువుగా సాగుతోంది. అలాగే అణగారిన అన్ని సమూహాల్లో ఈ పునర్జీవనం ప్రారంభమయ్యింది. అణగారిన కులం జాతి-తెగ-జెండర్-మతం- భాష- ప్రాంతాలకు చెందిన చైతన్యంతో వస్తున్న రచనలవల్ల బ్రాహ్మణ,శూద్ర ఆధిపత్యకులాల గుత్తనాయకత్వం, పట్టు క్రమంగా తగ్గిపోతోంది. అస్తిత్వ సాహిత్వాల ప్రతిఘటన ను, సవాళ్లను ఆధిపత్యకుల రచయితలు, వారి అభిమాను లు జీర్ణించుకోలేకపోతున్నారు.స్వాగతించలేకపోతున్నారు. దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, బిసీల జీవితాలను స్పృశించని కోస్తా బ్రాహ్మణ రచయితలు గురజాడ, శ్రీశ్రీ, చలం మొదలగువారిని బహుజన సమూహాలన్నింటికి సాహిత్య ప్రతినిధులుగా రుద్దే కుట్రలు జరుగుతున్నా యి. అనేకానేక పరిమితులున్న వారిని ప్రగతిశీల, అభ్యుదయ, ఆధునిక, విప్లవ సమగ్రతల మహత్తులు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి గొప్పతనం 'అనంత'మైనద ని ఆధిపత్య కులాల రచయితలు అంటున్నారు. భవిష్యత్ తరాలకు కూడా సమకాలికుడు గురజాడ అనీ, ముద్దుల గురజాడ అని, కన్యాశుల్కం - శ్రీశ్రీ శత జయంతి సందర్భాన్ని 'ఒకే ఆకాశంలో రెండు పున్నము'లని, జీవజలం చలం అనీ పాళీలు అరిగిపోయేలా పొగడ్తలు రాసేస్తున్నారు. వీరి శత జయంతి, వర్ధంతి కార్యక్రమాలను, సంస్మరణ ప్రత్యేక సంచికలను, ప్రత్యేక కథనాల ప్రసారాలను ముమ్మరం చేసారు. ఇదంతా రచనారంగంలో ఆధిపత్య కులాల పెత్తనాలను కాపాడుకునే ప్రయత్నాలే! నేటికీ ఆధిపత్య కులాలే పురోహిత, విద్య, పరిపాలన, సాంస్కృతిక, ఆర్థిక వ్యవస్థలను నియంత్రిస్తున్నాయి. వారసత్వం, భూమి (ధనం), కులంతో సమాజంపై పట్టు నిలుపుకునే ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాయి. బహుజన సమూహాలపై సాంస్కృతిక దాడిని సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ఆధిపత్య కులాలు కొనసాగించే దుశ్చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అస్తిత్వ ఉద్యమాల సంరంభాన్ని తెరమరుగుపరచటానికి ఆధిపత్యకులాలరచయితలు వొడి గడుతున్నారు. అస్తిత్వ ప్రవాహాలను అప్రధానం, అదృ శ్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నారు. మాదిగ, ముస్లిం, తెలంగాణ, బహుజనవాద రచయితలను గందరగోళపరి చి అస్తిత్వవాదాలనుండి మరలించి సాహిత్య రాజకీయా ల్లో పాలేర్లు (కార్యకర్తలు)గా, కోవర్టులుగా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని సాహిత్య వేదికల ఏర్పాటు ఇందులో భాగమే. అప్పారావు, శ్రీశ్రీ, చలంలకు ప్రగతిశీల, అభ్యుదయ, విప్లవ ముద్రలు వేసి, పరోక్షంగా బ్రాహ్మణ రచయితల్లో గొప్పతనం ఉందనిచెప్పే మోసం జరుగుతున్నది. బ్రాహ్మణ రచయితలు గొప్పవారని ప్రచారం చేసి, తర్వా తి వరసలో శూద్రాధిపత్య కులాల ఆధిక్యతలను సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో స్థాపించుకునే దుర్నీతి ఇది. 'మంచియన్నది మాలయైతే, మాల నేనగుదున్' అన్నా డు గురజాడ. అప్పారావు దృష్టిలో మాల మంచిదో కాదో సందేహంగానే మిగిలింది! కన్యాశుల్కం నాటకంలో రామ ప్ప పంతులు అనే బ్రాహ్మణ పాత్ర చేత అసిరిగాడు (దళితుడు) పాత్రని ఉద్దేశించి 'అపవిత్రం ముండాకొడుకు ఏవై నా తింటాడు. బ్రాహ్మలం పవిత్రమైనవాళ్లం గదా' అని కుల వివక్ష ప్రదర్శిస్తాడు. అప్పారావు నేడు బతికుంటే తీవ్ర విమర్శలను ఎదుర్కొని ఉండేవాడు. కాలం చెల్లిన, అమానవీయమైన కన్యాశుల్కం అభ్యుదయ నాటకమని కీర్తించే సాహిత్యాభిమాన శిఖామణులు రాజ్యాంగంలోని అధికరణం 17 అంటరానితనాన్ని నిషేధించిందని, కుల వివక్ష శిక్షార్హమైన నేరంగా గ్రహిస్తే మంచిది. బ్రాహ్మణ బాలిక పూర్ణమ్మ దయనీయస్థితి గురించి రాసిన అప్పారావు, దళిత పాత్ర అయిన అసిరిగాడికి గౌరవప్రదమైన పేరు పెట్టకపోవటం, మానవ హుందాతనం కల్పించలేకపోవ టం, ఆయనలోని బ్రాహ్మణ వివక్ష, అహంకారం కాదా? సాహిత్యయుగాన్ని ఇకపై నేను నడిపిస్తున్నానని గొప్ప లు పోయిన శ్రీశ్రీ కవిత్వంలో 'భూతాలు, యజ్ఞోపవీతా లు' వంటి హిందూ గ్రాంధిక వ్యాకరణ (బ్రాహ్మణ) శబ్దా లు చాలానే ఉన్నాయి. వ్యాకరణంలో చందోబద్దంగా బ్రాహ్మణ రచయితలే రాస్తారు. దానిని తోసిపుచ్చి శ్రీశ్రీ వంటి బ్రాహ్మలే చందస్సు సంకెళ్లని చట్‌ఫట్‌మని తెంచేస్తారు! సాహిత్యంలో గ్రాంధిక రచనా బ్రాహ్మణ్యమైనా, సరళ రచనా బ్రాహ్మణ్యమైనా వారి సొత్తేకాని, బహుజన రచయితల సొత్తు కాదని చెప్పే అహంకార ప్రదర్శన ఇది. ఏ గొప్ప ప్రాధాన్యత, విలువైనా బ్రాహ్మణులకే తప్ప బ్రాహ్మణేతర రచయితలకు కాదనే కుల వివక్ష కూలిపోవాల. ఆఫ్రికా ఖండంలోని 'హాటెన్ టాట్, జూలు, నీగ్రో' లు కనిపించిన శ్రీశ్రీకి రాజకీయ, మానవ హక్కులకోసం దేశంలో దళితులు చేసిన ఏ పోరాటమూ, ఉద్యమమూ కనిపించకపోవటం ఎంత ఆశ్చర్యం! కవితా వస్తువుగా శ్రీశ్రీకి దళిత జీవితం పనికిరాకపోవటం అమానుషం అనిపించడంలేదా? పోనీ, ఇది శ్రీశ్రీ పరిమితి అని అతని అభిమానులు వొప్పుకుంటారా? 'కసాయిబు' తిట్టు పద సృష్టి చేసినందుకు శ్రీశ్రీ అస్తిత్వ చైతన్యం కలిగిన నేటి ముస్లిం రచయితల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సిఉండేది. బ్రాహ్మణ, శూద్రాధిపత్య కులాల స్త్రీల స్వేచ్ఛని రచన ల్లో చిత్రించిన చలానికి బహుజన జెండర్ శ్రమలు గుర్తుకురాకపోవటం వింతేమీ కాదు. అది ఆయన కులం పరిమితి. మాదిగపిల్ల శీర్షిక పెట్టి మాలపిల్ల కథ చెప్పటం చలం అసం బద్ధ వస్తువిజ్ఞతకే చెల్లింది! అప్పారావు, శ్రీశ్రీ, చలంలకున్న పరిమితులను చూడనీయకుండా బ్రాహ్మణ, కోస్తాంధ్ర సాహిత్యకారులు వారికి మహిమలు అంటగట్టే ప్రయత్నా లు మానుకుంటే అస్తిత్వప్రవాహాల ప్రజాస్వామ్యానికి మేలు చేసినవారవుతారు. అడుగుజాడలని, మహాకవులని, స్త్రీవి ముక్తి నిర్దేశకులని కోస్తా బ్రాహ్మణ కవులను పొగుడుకోవటం దురదృష్టకరం. దేశంలో మెజారిటీ అయిన అణాగారిన జాతుల జీవితాలను వస్తువుగా స్వీకరించని బ్రాహ్మణ రచయితలను ఆకాశానికెత్తటం ప్రజాస్వామ్యానికే విఘాతం. అప్రజాస్వామిక, నిరంకుశ సాంస్కృతిక ధోరణులను బలపరుస్తున్న కమ్మ, రెడ్డి, సాహిత్యకారుల తీరు మారాలి. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, మాదిగ, దళిత, ముస్లిం, బహుజన వాదాల రచయితలు మేల్కొని ఉండి సాహి త్యంలో పాత పల్లకీల మోతను గట్టిగా వ్యతిరేకించాలి. సమానత్వాన్ని కోరే అస్తిత్వ ఉద్యమాలను ఎదగనివ్వడమే నేటి సాహిత్య ప్రజాస్వామ్యం. ఆధిపత్య కులవాదులు తమ కొమ్ములు కత్తిరించుకోడానికి సిద్ధం కావాల్సిందే. కాదంటే సౌహ్రార్దతకు తావు లేని సాహిత్యానికి చదువురులూ శ్రోతలూ మిగలరు. - కృపాకర్ మాదిగ
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

Wednesday, February 25, 2009

భారతీయులు స్వాభిమాన చింతనులేనా?


ఆస్కార్‌ అవార్డుల పంట పండిం దని సంబరపడుతున్నారే తప్ప, స్లమ్‌ డాగ్‌... టైటి ల్‌ భారతీయులందర్నీ కుక్కలుగా భావించి, అవమానించేదిగా ఉందని రాష్టప్రతి, ప్రధాని మొదలు రాజకీయ ప్రముఖులు దాకా గాని, సినిమా రంగ ప్రముఖులు మొదలు సామాన్య ప్రేక్షకుల వరకు గాని ఒక్క భారతీయురాలైనా, భారతీయుడైనా ఆలోచించకపోవటం మనమెంత భావదారిద్య్రంలో, భావ దాస్యంలో ఉన్నామో అర్థం కావటం లేదా? అద్దం పట్టడం లేదా? స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ సినిమా భారత దేశంలోని మురికివాడల కథనాన్ని తెరకెక్కించింది. ఇది ఆహ్వానించదగినదే. మన దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో. పట్టణాలన్నీ మురికి వాడలు, పేదల బస్తీలతోనే నిండి ఉన్నాయి. ఈ బస్తీలలో వ్యధాభరిత జీవితానుభవాలున్న వారందరూ మేధావులే. ప్రతియువతీ, ప్రతి యువకుడూ బస్తీ మేధావే. ఇలాంటి మేధావులని... డాగ్‌... గా, స్లమ్‌ డాగ్‌...గా కించపరిచే టైటిల్‌ పెట్టి ప్రచారం చేస్తూ, కాసుల వ్యాపారం చెయ్యటం సాంఘి క నేరం కాదా? సాంస్కృతిక నేరం కాదా? అగ్రరాజ్య సాంస్కృతిక ఆధిపత్యానికి బుద్ధిలేకుండా జై కొట్టడం కాదా?

ఇంతకీ బస్తీ కుక్క ఎవరు? హీరోనా? భారత దేశంలోని మురికి వాడల వాసులందరూనా? భారతీయ ప్రేక్షకులందరూనా? భారతీయ రచయిత రాసిన `క్యూ అండ్‌ ఏ' నవల శీర్షికను `బస్తీ కుక్క కరోడ్‌పతి'గా చిత్రీకరించటం పునర్ముద్రణకు సిద్ధం కావటం వెనక ఉన్న ఉద్దేశ్యాలేమిటి? చూస్తూ ఉండగానే జేబులు లూఠీ చెయ్యటమా? భారతీయుల వేళ్ళతోనే వారి కళ్ళను, మనసులను పొడిపించి నొప్పించడమా? మన మహానగరాల పాలకులు వలస పాలకులు పెట్టిపోయిన వీధి పేర్లనే పూర్తిగా తొలగించుకోలేకపోయారు! ఎవరో పెట్టిన సినిమా టైటిల్‌ని ఏం మార్చగలం అని అనుకుంటున్నామా? ఇలాగని సరిపెట్టుకుందామా? సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నిం చకుండా బతుకుదామా?

ప్రశ్నలకి సమాధానాలు సరిగ్గా చెప్పే కురక్రారంతా కుక్కలెలా అవుతారు? వలసవాద, జాత్యహంకార సినిమా పెట్టుబడి సడెన్‌గా ఈ సినిమాకి ఇన్ని ఆస్కార్‌ అవార్డులో ఎందుకిచ్చింది? వందకోట్ల పై చిలుకు ప్రేక్షకుల మార్కెట్‌ పై లాభాల వల విసిరేందుకు కాదా? భారతీయ మురికివాడలంటే దళితులు, ఆది వాసులు, అణగారిన సామాజిక వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలే. ఇలాంటి వర్గాల ఇతివృత్తం కలిగిన ఈ సినిమాకి ఆస్కార్‌ అవార్డులు అందుకున్నది మాత్రం పైకులాల సినిమా నిపుణులే కావటం విచిత్రం, విషాదం. మురికివాడల్లో నివసించే వాళ్ళు కేవలం కుక్కలేనా? మనుషులు కారా? ఈ సినిమా టైటిల్‌ తెల్లజాతి దురహంకారానికి, వారి తొత్తులైన భారతీయ ఆధిపత్య కులాల సినిమా వ్యాపారులందరి దురహంకారానికి నిదర్శనం కాదా?

వందేళ్ళ సినిమా చరిత్ర కలిగిన ఇండియన్‌ సినిమాలో ఎన్నో గొప్ప సినిమాలున్నాయి. ఇవి ఆస్కార్‌ అవార్డుల కమిటీ కళ్ళకు ఆనవా? రంగ్‌ దె బసంత్‌, లగాన్‌, భగత్సింగ్‌ పై తీసిన సినిమాలు, ఇళయరాజా లాంటి సంగీత రాజాలను ఆస్కార్‌ అవార్డుల కమిటీ చూడదా? (రెహమాన్‌కి, బస్తీ కుక్క...ల సినిమా బృందానికి ఆస్కార్‌ అవార్డులు ఇవ్వొద్దని కాదు) ఇప్పుడే, ఇలాంటి ఇండియన్‌ `బస్తీ కుక్క ...'లకే అవార్డులు ఎందుకు కురిపిస్తున్నట్లు? ఇండియన్‌ ప్రేక్షకులందరూ తమని అవమానించే టైటిళ్ళతో భవిష్యత్తులోనూ రాబోయే సినిమాలను సైతం చప్పట్లు, కేరింతలతో వెర్రివారై... కుక్క...లై చూడాలనా? అగ్ర రాజ్యాల నగరాల్లోని మురికివాడల ప్రజలకి ఇలాంటి కుక్క పేర్లు తగిలించి ఎవరైనా సినిమాలు తియ్యగలరా? అలా తీస్తే ఊరుకోం కదా? వివక్షలకు వ్యతిరేకంగా భారతీయులు ఎవరైనా సినిమాలు తీస్తే, ఆర్టు సినిమాలుగా ముద్రవేసి కలెక్షన్ల దగ్గర కుప్ప కూల్చేయడం సినిమా వ్యాపారానికి పాత విషయమే కాని, అగ్ర రాజ్యాల్లో ఉండేవారు ఇలాంటి సినిమాలు తీస్తే, ఇండియన్‌ మీడియా విశేషమైన ప్రచారాన్ని ఎందుకు కల్పిస్తోంది? ఇది సిగ్గుచేటు అంశం కాదా? ఒక విదేశీ సాంస్కృతిక సామ్రాజ్యావాద సినిమాని ఇండియన్‌ ప్రేక్షకులు ఎగబడి చూసే వారిగా ప్రభావితం చెయ్యటం పెట్టుబడి మీడియాకి న్యాయ సమ్మతం కాదు. ఏది ఏమైనా, ఈ సినిమా టైటిల్‌ భారతీయులందరి ఆత్మాభిమానాన్ని అవమానించేదిగా ఉంది. పోరాడి ఈ టైటిల్‌ని మార్చుకోక పోతిమా, దేశమే కుక్కగా మారిపోయే ప్రమాదముంది జాగ్రత్త!

- కృపాకర్‌ మాదిగ, జూపాక సుభద్ర

( సుర్య దినపత్రిక 26-2-2009 సౌజన్యంతో)

Friday, February 20, 2009

సాహిత్య యాజమాన్యాలను నిలదీస్తున్న అస్తిత్వ విమర్శ


అభిమానులకు విజ్ణప్తి

మాదిగ సాహిత్యంపై పరిశోధనలు, పుస్తక ముద్రణలు సీరియస్ గా విస్తృతంగా జరుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఏకైక, అత్యధిక (పది శాతం) జనాభాతో మాదిగ కులం ఉంది. అందుకని ’సింహభాగం జనాభా మాది.సింహభాగం తెలుగు సాహిత్యమూ మాదే ’అని నిరూపించేదిశగా మాదిగ సాహిత్యం వెలువడుతుంది. ఒక ఉధ్యమంగా జరుగుతున్న మా కృషికి ఆర్థిక, హార్థిక సహకారాన్ని అందించ వలసినదిగా మాదిగ సాహిత్యాభిమానులను కోరుతున్నాము.